క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీని ఉద్దేశించి తీవ్ర స్థాయిలో విరుచుకుపడే యోగ్రాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో తాను కపిల్ దేవ్ ను చంపడానికి సిద్ధపడినట్లు గుర్తుచేసుకున్నారు. కపిల్ ఇంటికి తుపాకీ తీసుకెళ్లి బెదిరించినట్లు నాటి సంఘటన గురించి చెప్పారు.
"కపిల్ దేవ్ టీమిండియా కెప్టెన్ అయ్యాక, నన్ను ఏ కారణం లేకుండా జట్టు నుంచి తప్పించాడు. దీంతో నా భార్య కపిల్ ను ప్రశ్నించాలనుకుంది. నేను కపిల్ కు బుద్ధి చెప్పి వస్తానని ఆమెతో చెప్పాను. వెంటనే నా తుపాకీ తీసుకుని సెక్టర్ 9లో ఉన్న కపిల్ ఇంటికి వెళ్లాను. అతడు తన తల్లితో కలిసి బయటకు వచ్చాడు. అతడిని అప్పుడు చాలా సార్లు తిట్టాను. 'నీ వల్ల, నువ్వు చేసిన పని వల్ల నా స్నేహితుడిని (క్రికెట్) కోల్పోయాను. నీ తల మీద కాల్చాలని ఉంది కానీ అలా చేయను. ఎందుకంటే నీకు ఓ దయకలిగిన తల్లి ఉంది'. అని అతడితో చెప్పి తిరిగొచ్చేశాను. అప్పుడే ఇక క్రికెట్ ఆడకూడదని నిర్ణయించుకున్నాను. " అని యోగరాజ్ పేర్కొన్నాడు.

జీవితంలో అతడిని అస్సలు క్షమించను
దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ తో తనకు మంచి అనుబంధం ఉందని.. బిషన్ సింగ్ బేడీ, కపిల్ దేవ్ కలిసి తనకు వ్యతిరేకంగా వ్యవహరించారని చెప్పాడు యోగరాజ్. "వీరందరూ కలిసి నాకు వ్యతిరేకంగా వ్యవహరించారు. నేను బిషన్ సింగ్ బేడీని అస్సలు క్షమించను. నన్ను జట్టులోకి తీసుకోకూడదని బిషన్ సింగ్ బేడీ కుట్ర పన్నాడని, నాకు రవింద్ర చద్ధా అనే సెలక్టర్ అప్పట్లో చెప్పారు. ఎందుకంటే నేను సునీల్ గావస్కర్ మనిషి అని, ఆయనతో బాగా క్లోజ్ ఉంటానని వాళ్లు భావించారు." అని యోగరాజ్ నాటి సంఘటనను గుర్తుచేసుకున్నాడు.
ఒకే తల్లి కడుపులో పుడదాం
28 ఏళ్ల తర్వాత 2011లో టీమిండియా వన్డే వరల్డ్ కప్ గెలిచాక తాను కపిల్ దేవ్ కు వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లు తెలిపారు యోగరాజ్. "2011లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు, ఎవరైనా ఏడ్చిన వ్యక్తి ఉన్నాడంటే అతడు కపిల్ దేవ్ మాత్రమే. అతడికి నేను పేపర్ కటింగ్ ను పంపించి, నీ కన్నా నా కొడుకు వరల్డ్ కప్ లో బాగా ఆడాడు అని చెప్పాను. దానికి తిరిగి కపిల్ కూడా నాకు సందేశం పంపాడు. వచ్చే జన్మలో ఇద్దరు అన్నదమ్ములుగా, ఒకే తల్లి కడుపులో జన్మింద్దాం అని బదులిచ్చాడు. నన్ను కలుద్దాం అని అనుకున్నాడు." అని యోగరాజ్ చెప్పుకొచ్చాడు.