Yogi Adityanath: యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI)కి ఒక కీలక విజ్ఞప్తి చేశారు. దేశంలోనే అత్యధిక జనాభా(సుమారు 24.63 కోట్లు) కలిగిన రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్కు ప్రస్తుతం కేవలం ఒకే డొమెస్టిక్ క్రికెట్ జట్టు ఉండటం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర యువ క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు దేశీయ టోర్నమెంట్లలో ఉత్తరప్రదేశ్ నుంచి కనీసం నాలుగు జట్లను చేర్చాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ బీసీసీఐని కోరారు.
సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక విజ్ఞప్తి
యూపీ టీ20 లీగ్ ఫైనల్ సందర్భంగా లక్నోలోని ఎకానా స్టేడియంలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. "మన ఆటగాళ్లకు ఉత్తరప్రదేశ్లోనే మంచి వేదికలు దక్కాలని నేను భావిస్తున్నాను. యూపీ నుంచి ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. 25 కోట్ల జనాభా ఉన్న యూపీ రాష్ట్రానికి దేశీయ క్రికెట్ లో కేవలం ఒకే జట్టు ఉండటం ఆందోళన కలిగించే విషయం. బీసీసీఐకి నా విజ్ఞప్తి ఏంటంటే.. రాష్ట్రం నుంచి కనీసం నాలుగు జట్లను డొమెస్టిక్ టోర్నమెంట్లలో చేర్చాలి. ఈ అవకాశం మన రాష్ట్రానికి దక్కాలి." అని అన్నారు.

ప్రస్తుత పరిస్థితి
ప్రస్తుతం డొమెస్టిక్ క్రికెట్లో గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు 3 చొప్పున జట్లు ఉన్నాయి. గుజరాత్ రాష్ట్రానికి సౌరాష్ట్ర, బరోడా జట్లు ఉండగా.. మహారాష్ట్రకు ముంబై, విదర్భ జట్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ నుంచి జట్ల సంఖ్యను పెంచాలనే డిమాండ్ కొత్తదేమీ కాదు.. గత కొన్నేళ్లుగా ఈ విషయంపై చర్చ జరుగుతూనే ఉంది.
యూపీ క్రికెట్ చరిత్ర
ఉత్తరప్రదేశ్ దేశీయ క్రికెట్లో ఎల్లప్పుడూ బలమైన జట్టుగానే ఉంది. చివరిసారిగా మహ్మద్ కైఫ్ నాయకత్వంలో 2005-06లో రంజీ ట్రోఫీ గెలుచుకుంది. అలాగే సురేశ్ రైనా నాయకత్వంలో 2015-16లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని కూడా సొంతం చేసుకుంది. అయితే ఇప్పటివరకు విజయ్ హజారే ట్రోఫీని మాత్రం గెలుచుకోలేకపోయింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన ఈ విజ్ఞప్తి యువ క్రికెటర్లకు కొత్త అవకాశాలు కల్పించేందుకు దోహదపడుతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.