హైదరాబాద్: టీమిండియాలో చోటు దక్కించుకోవాలంటే యో-యో టెస్టు తప్పనిసరిగా పాసవ్వాలి. అలాంటి యో-యో టెస్టులో పాసవ్వాలంటే కనీసం మార్కులు 16.1 తెచ్చుకోవాలి. ఈ నిబంధనను బీసీసీఐ గతేడాది నుంచి అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
యో-యో టెస్టుకి హాజరైన కోహ్లీ, ధోని: గాయంపై లేని స్పష్టత
కానీ, ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రికెట్ జట్లతో పోలిస్తే ఈ మార్కులు చాలా తక్కువంట. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, దక్షిణాఫ్రికాతో పాటుతో మన దాయాది దేశమైన పాకిస్థాన్ జట్టు కూడా యో-యో టెస్టులో పాసవ్వాలంటే భారత్ కంటే ఎక్కువ మార్కులనే నిర్దేశించినట్లు తెలుస్తోంది.
గత వారం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన యో-యో ఫిట్నెస్ టెస్టులో భారత ఆటగాళ్లు మహమ్మద్ షమీ, అంబటి రాయుడు, సంజు శాంసన్ ఫెయిలైన సంగతి తెలిసిందే. మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ధోని, సురేశ్ రైనా పాసయ్యారు.
దీంతో త్వరలో జరిగే ఇంగ్లాండ్ పర్యటన వెళ్లేందుకు గాను వీరికి లైన్ క్లియర్ అయింది. అయితే, భారత క్రికెటర్లు యో-యో పరీక్షలో పాస్ మార్కులను 16.1గా నిర్దేశించడాన్ని భారత మాజీ ఫిజియో జాన్ విమర్శించారు. జాతీయ మీడియాలో వచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లకి ఆయా దేశాల క్రికెట్ బోర్డులు తమ ఆటగాళ్లు యో-యో ఫిట్నెస్ టెస్టులో పాసవ్వాలంటే కనీసం 19 మార్కులు రావాలని నిబంధన విధించగా.. దక్షిణాఫ్రికా 18.5, శ్రీలంక 17.4, పాకిస్థాన్ 17.4 మార్కులు సాధించాలని నిబంధన పెట్టినట్లు తేలింది.
దీంతో, టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఇటీవల యో-యో టెస్టు పాస్ మార్కుల పెంపుపై బీసీసీఐతో చర్చించినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం యో-యో ఫిట్నెస్ టెస్టులో ఉత్తీర్ణత సాధించాలంటే సదరు క్రికెటర్ కనీసం 16.1 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. అయితే దీనిని 16.3కి పెంచాలనే యోచనలో బీసీసీఐ ఉంది.