బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16వ ఎడిషన్లో ప్రారంభంలోనే అనూహ్య విజయాలు నమోదవుతున్నాయి. గత సీజన్కు భిన్నంగా బ్యాటర్లదే రాజ్యం. గెలిచిన జట్లన్నీ భారీ స్కోర్ను సాధించినవే.. దాన్ని ఛేదించినవే. గత ఏడాది ఐపీఎల్ ఫైనలిస్ట్ రాజస్థాన్ రాయల్స్.. తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించింది. సన్రైజర్స్ హైదరాబాద్పై భారీ స్కోరు సాధించింది. ఈ సీజన్లో 200లకు పైగా స్కోర్ సాధించిన తొలి జట్టుగా నిలిచింది.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో లోకల్ టీమ్ సన్రైజర్స్ను మట్టికరిపించింది రాజస్థాన్. తొలుత బ్యాటింగ్ చేసిన పింక్ టీమ్. నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేయగా.. సన్రైజర్స్ దాన్ని ఛేదించలేక చతికిలపడింది. 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 131 పరుగులే చేయగలిగింది. 72 పరుగుల తేడాతో రాజస్థాన్ చేతిలో పరాజయాన్ని చవి చూసింది ఆరెంజ్ ఆర్మీ. వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.

హైదరాబాద్ ఇన్నింగ్లో తొలుత బౌలర్లు, ఆ తరువాత బ్యాటర్లు కలిసికట్టుగా విఫలం కావడం జట్టు ఓటమికి కారణమైంది. జస్థాన్ ఓపెనర్లు జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్తో పాటు కేప్టెన్ సంజూ శాంసన్ హాఫ్ సెంచరీలు చేశారు. స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ నాలుగు వికెట్లు నేలకూల్చాడు. రాజస్థాన్ బౌలర్లను ఏ మాత్రం ప్రతిఘటించలేకపోయారు హైదరాబాద్ బ్యాటర్లు. లోయర్ ఆర్డర్లో 32 పరుగులు చేసిన అబ్దుల్ సమద్ ఒక్కడే టాప్ స్కోరర్.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్లో లోకల్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెలరేగిపోయింది. ఎనిమిది వికెట్ల తేడాతో రోహిత్ సేనను ఓడించింది. నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి ముంబై ఇండియన్స్ చేసిన 171 పరుగులను బెంగళూరు టీమ్ ఊది అవతల పడేసింది. ఈ క్రమంలో రెండు వికెట్లను మాత్రమే కోల్పోయింది. 16.2 ఓవర్లల్లోనే ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.
రన్ మిషన్ విరాట్ కోహ్లీ తనదైన ట్రేడ్ మార్క్ షాట్లతో రెచ్చిపోయాడు. 49 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ఇందులో ఆరు ఫోర్లు అయిదు భారీ సిక్సర్లు ఉన్నాయి. కేప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అదే రేంజ్లో ఆడాడు. 43 బంతుల్లో అయిదు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 73 పరుగులు కొట్టాడు. ఆర్సీబీ ఇన్నింగ్లో కర్ణ్ శర్మ రెండు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ షమీ, రీస్ టోప్లే, ఆకాష్ దీప్, హర్షల్ పటేల్, మిఛెల్ బ్రేస్వెల్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.