హైదరాబాద్: అబుదాబి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న టెస్టులో పాకిస్థాన్ స్పిన్నర్ యాసిర్ షా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో అరంగేట్రం నుంచి తన సంచలన బౌలింగ్తో యాసిర్ షా అభిమానులను అలరిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా గురువారం శ్రీలంకతో ప్రారంభమైన తొలి టెస్టు తొలి రోజు రెండు వికెట్లు తీసిన యాసిర్ షా టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా 150 వికెట్లు సాధించిన స్పిన్నర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 150 వికెట్ల మైలురాయిని 29 మ్యాచ్లో అందుకుని ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్నాడు.
తాజాగా ఆ రికార్డుని 27 టెస్టుల్లోనే అందుకుని యాసిర్ షా అగ్రస్ధానంలో నిలిచాడు. ఇక ఫాస్ట్ బౌలర్ల విషయానికి వస్తే పాకిస్థాన్కు చెందిన పేసర్ వకార్ యూనిస్ 24 టెస్టుల్లోనే 150 వికెట్ల మైలురాయిని అందుకుని ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఇప్పుడు స్పిన్నర్ల జాబితాలో అదే పాకిస్థాన్కు చెందిన యాసిర్ షా అగ్రస్ధానంలో నిలిచాడు. టెస్టుల్లో 100 వికెట్లను కేవలం 17 టెస్టుల్లోనే యాసిర్ షా సాధించడం విశేషం. ఇదిలా ఉంటే దిముత్ కరుణరత్నె (93) రాణించడంతో పాక్తో జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు శ్రీలంక మెరుగైన స్థితిలో ఉంది.
గురువారం ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది.61 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన శ్రీలంకను కరుణరత్నే(93), కెప్టెన్ చండిమాల్ (60 బ్యాటింగ్)తో రాణించి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. కరుణరత్నె సెంచరీ ముందు అవుటైనా డిక్వెలా (42)తో కలిసి చండిమాల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు.