గౌహతి వేదికగా జరుగుతున్న రాజస్థాన్ రాయల్స్-పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో పరుగుల కోసం బ్యాటర్లు చెమటోడుస్తున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (48; 34 బంతుల్లో, 6x4), రవిచంద్రన్ అశ్విన్ (28; 19 బంతుల్లో, 4x3, 1x6) టాప్ స్కోరర్లు.
స్లో పిచ్పై పంజాబ్ బౌలర్లు సామ్ కరన్ (2/24), రాహుల్ చాహర్ (2/26), హర్షల్ పటేల్ (2/28) తలో రెండు వికెట్లతో చెలరేగారు. కాగా, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. యశస్వీ జైస్వాల్ (4; 4 బంతుల్లో, 1x4)ను తొలి ఓవర్లోనే ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ సామ్ కరన్ ఔట్ చేశాడు.

అయితే యశస్వీ జైస్వాల్ బలహీనతను ప్రత్యర్థి జట్లు ఢీకోడ్ చేసేశాయి. జైస్వాల్ను సునాయసంగా పెవిలియన్కు చేర్చుతున్నాయి. ఈ యువ ఓపెనర్ బ్యాటింగ్ చేస్తున్న సందర్భాల్లో ఎడమ చేతి వాటం బౌలర్తో బౌలింగ్ చేయిస్తూ వికెట్ను సాధించుకుంటున్నాయి. ఐపీఎల్-2024లో లెఫ్ట్ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ల చేతిలో జైస్వాల్ ఏకంగా ఆరు సార్లు ఔటయ్యాడు.
ఎడమచేతి వాటం పేసర్లు వేసిన 72 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ 16 సగటుతో 99 పరుగులు సాధించాడు. 29 బంతులకు పరుగులేమి చేయలేదు. 15 ఫోర్లు, ఓ సిక్సర్ బాదాడు. జైస్వాల్ బలహీనతను అర్థం చేసుకున్న పంజాబ్ కింగ్స్ సామ్ కరన్తో బౌలింగ్ ఆరంభించింది. తొలి బంతికే ఫోర్ కొట్టిన జైస్వాల్ నాలుగో బంతికి బౌల్డయ్యాడు.
ఈ బలహీనతను జైస్వాల్ అధిగమించకపోతే టీ20 వరల్డ్ కప్లో భారత్కు తీవ్ర ప్రభావం చూపుతుంది. జూన్ 2వ తేదీ నుంచి టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగాటోర్నీలో రోహిత్ శర్మతో కలిసి జైస్వాల్ టీమిండియా ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు. ఆదిలోనే జైస్వాల్ వికెట్ కోల్పోతే అది జట్టుపై ప్రతికూలత ప్రభావం పడుతుంది. కాగా, ఐపీఎల్-2024లో 13 మ్యాచ్లు ఆడిన జైస్వాల్ 29 సగటు, 152 స్ట్రైక్రేటుతో 348 పరుగులు చేశాడు. దీనిలో ఓ సెంచరీ ఉంది.