
ఈస్ట్ లండన్ (దక్షిణాఫ్రికా): ఆల్రౌండర్ యశస్వీ జైస్వాల్ (89 నాటౌట్, 4/13) అదరగొట్టడంతో దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుతో శనివారం జరిగిన రెండో వన్డేలో యువ భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో అండర్-19 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా సఫారీలతో జరుగుతున్న అనధికారిక మూడు వన్డేల సిరీస్ను యువ భారత్ 2-0తో కైవసం చేసుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 29.5 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. యశస్వి తన స్పిన్ బౌలింగ్తో రెచ్చిపోయాడు. యశస్వి బౌలింగ్ (4/13)లో అద్భుత గణాంకాలతో విజృంభించాడు. ఆతిథ్య జట్టు తరఫున జొనాథన్ బర్డ్ (25) టాప్ స్కోర్ కావడం గమనార్హం. భారత బౌలర్లలో ఆకాశ్, అంకొలేకర్, రవి తలా 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 16.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసి విజయం సాధించింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే కెప్టెన్ ప్రియమ్ గార్గ్ (0), రావత్ (2) వికెట్లను కోల్పోయినా.. ఓపెనర్ జైస్వాల్ (56 బంతుల్లో 89 నాటౌట్; 14 ఫోర్లు, 3 సిక్స్లు) టీ20 తరహాలో సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతనికి ధ్రువ్ జురెల్ (26 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) తోడవటంతో భారత్ సునాయాస విజయాన్ని అందుకుంది.
బ్యాటింగ్, బౌలింగ్లో రాణించిన యశస్వికి 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్న యశస్వి శనివారం తన 18వ జన్మదినాన్ని మరపురానిదిగా చేసుకున్నాడు. ఇక ఈ విజయంతో మూడు మ్యాచ్ల సిరీస్ను ఇంకా ఒక వన్డే మిగిలి ఉండగానే 2-0తో భారత్ కైవసం చేసుకుంది. చివరి వన్డే ఈ నెల 30న జరుగుతుంది.