ప్రస్తుతం జరుగుతోన్న రంజీ ట్రోఫీలో విదర్భతో జరగబోయే సెమీ ఫైనల్కు ముందు ముంబయి జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, యంగ్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సెమీస్ కు దూరమయ్యాడు. గాయం కారణంగా అతడు ఈ సెమీ ఫైనల్ కు దూరమైనట్లు తెలిసింది. జైశ్వాల్ చీలమండ గాయంతో బాధపడుతున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రచురించింది. అయితే దీనిపై ఇంకా ఎటువంటి అధికార ప్రకటన రాలేదు.
ఛాంపియన్స్ ట్రోఫీలో మరొక ఆటగాడితో..
ఇప్పుడు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి యశస్వి జైశ్వాల్ ను పంపించనున్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. అయితే జైశ్వాల్ ను రీసెంట్ గానే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు నుంచి బీసీసీఐ రిలీజ్ చేసింది. అతడిని నాన్ ట్రావెలింగ్ రిజర్వ్ గా తీసుకుంది. కానీ ఇప్పుడు అతడు గాయపడడంతో అతడి స్థానాన్ని మరొకరితో భర్తీ చేయాల్సి ఉంటుంది.

"జైశ్వాల్ ఎడమ కాలి చీలిమండ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో అతడు రంజీ ట్రోఫీ సెమీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. నాగ్ పూర్ లోని ముంబయి ప్రాక్టీస్ సెషన్ నెట్స్ లో బ్యాటింగ్ చేసేటప్పుడు అతడు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. గతంలో తగిలిన గాయమే మళ్లీ తిరగబెట్టింది. దీంతో రికవరీ కోసం అతడు జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నాడు." అని ఓ క్రికెట్ ప్రతినిధి తెలిపాడు.
సెమీస్ లో ఆ ఇద్దరు ఓపెనర్లుగా..
ముంబయి - విదర్భ మధ్య రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్ నాగ్పూర్ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కు యశస్వీ దూరం కావడం వల్ల ముంబయి ఇన్నింగ్స్ను ఆయుష్ మాత్రే, ఆకాష్ ఆనంద్ ప్రారంభిస్తారు.