స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ జట్టుకు దూరమయ్యారు. ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఊహించని పరాజయం. అయిదు టెస్టుల సిరీస్ను క్లీన్ స్వీప్ చేస్తుందనే అంచనాలతో బరిలోకి దిగిన భారత్.. ఒక్కసారిగా ఆత్మరక్షణలోకి పడిపోయింది. మరోవైపు ఇంగ్లండ్ ఫేవరేట్గా మారింది. ఈ పరిస్థితుల్లో వైజాగ్ టెస్టులో యువ బ్యాటింగ్ లైనప్తో టీమిండియా బరిలోకి దిగింది. కానీ ఆదిలోనే షాక్ ఎదురైంది.
నాయకుడు రోహిత్ శర్మ తొలి సెషన్ వరకు కూడా నిలవలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కుదురుకున్నట్లు కనిపిస్తున్నారు... వరుసగా వికెట్లు కోల్పోతున్నారు. అలా అనీ పిచ్ బౌలింగ్కు అంత గొప్పగా అనుకూలించట్లేదు. ఇంగ్లండ్ క్రమశిక్షణ బౌలింగ్కు వికెట్లు సమర్పించుకుంటున్నారు. దీంతో భారత్ శిబిరంలో మరోసారి ఆందోళన కనిపించింది. రెండో టెస్టు చేజారినట్లేనా అనే భయం అభిమానుల్లో కలిగింది. కానీ 22 ఏళ్ల కుర్రాడు ఇంగ్లండ్ ఆధిపత్యాన్ని అడ్డుకున్నాడు. 'వాల్' వంటి ఇన్నింగ్స్ ఆడి భారత్ను పోటీలోకి తెచ్చాడు. అతడే యశస్వీ జైస్వాల్.

మంచి బంతుల్ని గౌరవిస్తూ చెత్త బంతుల్ని శిక్షిస్తూ జైస్వాల్ స్కోరుబోర్డు పరుగులు పెట్టించాడు. దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. 290 బంతులు ఎదుర్కొని 209 పరుగులు సాధించాడు. 19 ఫోర్లు, ఏడు సిక్సర్లు బాదాడు. వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆలోచించలేదు. సెంచరీకి దగ్గరలో ఉన్నా, డబుల్ సెంచరీకి చేరువలో ఉన్నా బంతిని విడిచిపెట్టలేదు. జట్టు స్కోరే ముఖ్యం అన్నట్లుగా సిక్సర్తో సెంచరీ, బౌండరీతో డబుల్ సెంచరీ అందుకున్నాడు. సెహ్వాగ్ను గుర్తుకుతెచ్చాడు.
భారత్ ఇన్నింగ్స్లో జైస్వాల్ తర్వాత అత్యధిక స్కోరు శుభ్మన్ గిల్ సాధించిన 34 పరుగులే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో జైస్వాల్ను కొనియాడుతూ పోస్ట్లు వెల్లువెత్తుతున్నాయి. యశస్వీ భవ, జైస్వాల్ సూపర్ ఇన్నింగ్స్ అంటూ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసించాడు. మరోవైపు నెటిజన్లు జైస్వాల్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మిగిలిన బ్యాటర్ల వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఇది భారత్-ఇంగ్లండ్ మ్యాచ్లా లేదని, జైస్వాల్-ఇంగ్లండ్ పోరుగా అనిపిస్తుందని కామెంట్లు చేస్తున్నారు. కాగా, తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 396 పరుగులకు ఆలౌటైంది.