ఐపీఎల్-2024 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ టాప్ గేర్లో దూసుకెళ్తోంది. జైపుర్ వేదికగా ముంబై ఇండియన్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘనంగా నెగ్గింది. ఈ సీజన్లో ఎనిమిది మ్యాచ్లు ఆడిన RR ఏడు విజయాలతో టేబుల్ టాప్లో కొనసాగుతోంది.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. తిలక్ వర్మ (63; 45 బంతుల్లో, 5x4, 3x6), నెహాల్ వదేరా (49; 24 బంతుల్లో, 3x4, 4x6) టాప్ స్కోరర్లు. సందీప్ శర్మ అయిదు వికెట్లతో (5/18)తో చెలరేగాడు. అనంతరం రాజస్థాన్ రాయల్స్ 18.4 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. యశస్వీ జైస్వాల్ (104*; 60 బంతుల్లో, 9x4, 7x6) అజేయం శతకంతో అదరగొట్టాడు.

ఈ క్రమంలో జైస్వాల్ పలు రికార్డులు బద్దలుకొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు శతకాలు సాధించిన 23 ఏళ్లలోపు ఏకైక ప్లేయర్గా రికార్డులకెక్కాడు. 22 ఏళ్ల జైస్వాల్ ఈ రెండు సెంచరీలు ముంబై ఇండియన్స్పైనే సాధించడం విశేషం. 2023లోవాంఖడేలో ముంబైపై తొలి సెంచరీ బాదాడు. 124 పరుగులు చేశాడు. 21 ఏళ్ల 123 రోజుల వయసులో ఈ మూడంకెల స్కోరును అందుకున్నాడు. అనంతరం నిన్న మరో శతకాన్ని సాధించాడు. 22 ఏళ్ల 116 రోజుల వయసులో మరో శతకాన్ని బాదాడు.
కాగా, ముంబై ఇండియన్స్పై రెండు సెంచరీలు చేసిన జైస్వాల్ మరో రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్లో ఓ జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో అతడు రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో కేఎల్ రాహుల్ ఉన్నాడు. రాహుల్ ముంబైపై ఏకంగా మూడు సెంచరీలు చేశాడు. క్రిస్ గేల్ (పంజాబ్ కింగ్స్పై), విరాట్ కోహ్లి (గుజరాత్ టైటాన్స్పై), డేవిడ్ వార్నర్ (కేకేఆర్పై), బట్లర్ (కేకేఆర్పై), బట్లర్ (ఆర్సీబీపై)తో కలిసి జైస్వాల్ ఉమ్మడిగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.