పరుగుల వరద పారిస్తున్న టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరో అరుదైన ఘనత సాధించాడు. స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లి రికార్డును సమం చేశాడు. ఇంగ్లండ్ టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా కోహ్లి సరసన జైస్వాల్ నిలిచాడు. రాంచీ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో జైస్వాల్ ఈ ఘనత అందుకున్నాడు.
అంతకుముందు ఈ రికార్డు కోహ్లి పేరిట ఉండేది. 2016లో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో కోహ్లి 655 పరుగులు చేశాడు. ఎనిమిదేళ్ల తర్వాత జైస్వాల్ ఈ రికార్డును సమం చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్లో రెండు డబుల్ సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు సాధించిన జైస్వాల్ 655 పరుగులు చేశాడు. ఈ జాబితాలో జైస్వాల్, విరాట్ కోహ్లి తర్వాత స్థానాలో రాహుల్ ద్రవిడ్ (602 పరుగులు, 2002),కోహ్లి (593 పరుగులు, 2018), వీ మంజ్రేకర్ (586 పరుగులు, 1961-62) ఉన్నారు. టాప్-5లో కోహ్లి రెండు సార్లు ఉండటం విశేషం.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టీమిండియా గెలుపు దిశగా అడుగులు వేస్తుంది. విజయానికి మరో 78 పరుగుల దూరంలో నిలిచింది. ఓవర్నైట్ స్కోరు 40/0తో ఇవాళ ఆటను ప్రారంభించిన భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (55; 81 బంతుల్లో), యశస్వీ జైస్వాల్ (37; 44 బంతుల్లో) సాధికారికంగా ఆడారు. తొలి వికెట్కు 84 పరుగులు జోడించారు. కానీ అండర్సన్ గ్రేట్ క్యాచ్తో జైస్వాల్ పెవిలియన్కు చేరాడు. రూట్ బౌలింగ్లో షాట్కు యత్నించిన జైస్వాల్ అండర్సన్ చేతికి చిక్కాడు.
అనంతరం రోహిత్ స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 64 బంతుల్లో అర్ధశతకం అందుకున్నాడు. కానీ కాసేపటికే టామ్ హర్ట్లీ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఆ తర్వాత నాలుగో స్థానంలో వచ్చిన రజత్ పటిదార్ డకౌటయ్యాడు. ఆరు బంతులు ఎదుర్కొన్న పటిదార్ షోయబ్ బషీర్ బౌలింగ్లో ఔటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా 33 ఓవర్లకు 114/3తో నిలిచింది. క్రీజులో శుభ్మన్ గిల్ (15*), రవీంద్ర జడేజా (2) ఉన్నారు.