పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ పరుగుల వరద పారించాడు. తొలి ఇన్నింగ్స్లో డకౌటైన కసితో రెండో ఇన్నింగ్స్లో చెలరేగాడు. 297 బంతుల్లో 161 పరుగుల భారీ స్కోర్ చేశాడు. 15 ఫోర్లు, 3 సిక్సర్లతో చెలరేగాడు. మొదటి ఇన్నింగ్స్లో ఎనిమిది బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ పరుగులేమి చేయకుండా వెనుదిరిగిన సంగతి తెలిసిందే.
అయితే తన టెస్టు కెరీర్లో నాలుగో సెంచరీ చేసిన యశస్వీ జైస్వాల్ పలు రికార్డులు బద్దలుకొట్టాడు. టెస్టుల్లో తొలి నాలుగు శతకాలను 150+ స్కోరుగా మలిచిన తొలి ఆసియా క్రికెట్ర్గా చరిత్రకెక్కాడు. అంతేగాక 23 ఏళ్ల వయస్సులోపు టెస్టుల్లో అత్యధిక సార్లు 150+ స్కోరు సాధించిన ప్లేయర్గానూ సచిన్ టెండూల్కర్, పాకిస్థాన్ ఆటగాడు జావెద్ మియానంద్ సరసన జైస్వాల్ నిలిచాడు. సచిన్, మియానంద్ కూడా తమ 23 ఏళ్లలోపు నాలుగు సార్లు 150+ స్కోరు సాధించారు.

అంతేగాక జైస్వాల్ మరో అరుదైన ఘనత సాధించాడు. తొలి 15 టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. 22 ఏళ్ల యశస్వీ జైస్వాల్ 15 మ్యాచ్ల్లో 58.07 సగటుతో 1568 పరుగులు చేశాడు. నాలుగు సెంచరీలు, ఎనిమిది హాఫ్ సెంచరీలు బాదాడు. సాధించిన నాలుగు సెంచరీల్లో రెండింటి డబుల్ సెంచరీగా మలిచాడు. ఇంగ్లండ్పై 209, 214*, వెస్టిండీస్పై 171 పరుగులు చేశాడు. కాగా, ఈ జాబితాలో అగ్రస్థానంలో డాన్ బ్రాడ్మన్ (2115) ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా మార్క్ టేలర్ (1618), ఎవర్టన్ వీక్స్ (1576), జైస్వాల్ (1568), మైకేల్ హస్సీ (1560) ఉన్నాడు.
ఇక తొలి 15 టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ప్లేయర్గా జైస్వాల్ రికార్డు సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు విజయ్ హజారే పేరిట ఉంది. ఆయన 1420 పరుగులు చేశాడు. కాగా, ప్రస్తుతం భారత్ 98 ఓవర్లకు 324/5 స్కోరు చేసింది. ఆస్ట్రేలియాపై 370 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 150, ఆసీస్ 104 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.