వెస్టిండీస్తో తొలి టెస్టులో భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తర్వాత అందరూ యశస్వి జైస్వాల్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ యువ ఓపెనర్ తన అరంగేట్రంలోనే 171 పరుగుల భారీ శతకంతో చెలరేగాడు. భారత జట్టు సులభంగా విజయం సాధించడంలో జైస్వాల్ పాత్ర చాలానే ఉంది. పేద కుటుంబం నుంచి వచ్చిన జైస్వాల్.. ఇలాంటి ఘనత సాధిస్తే ఆ కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుంది?
ముంబైలో పానీ పూరీ అమ్ముకునే కుటుంబానికి చెందిన జైస్వాల్.. టెస్టు అరంగేట్రంలో సెంచరీ బాదిన 17వ భారత బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. దీనిపై అతని తండ్రి భూపేంద్ర స్పందిస్తూ ఎమోషనల్ అయ్యాడు. తన కుమారుడు సెంచరీ చేసిన రోజు ఉదయమే తనకు కాల్ చేశాడని, ఇద్దరం కడా ఏం మాట్లాడలేక కన్నీళ్లు పెట్టుకున్నామని భూపేంద్ర వెల్లడించాడు. విండీస్లో మ్యాచ్ ముగిసే సమయానికి భారత్లో టైం తెల్లవారుజామున 2.30 గంటలు అవుతుంది.

'సెంచరీ చేసిన రోజు ఉదయం 4.30 గంటలకు కాల్ చేశాడు. ఫోన్లో కన్నీళ్లు ఆపుకోలేకపపోయాడు. నేను కూడా ఏడ్చేశాను. అది మాకు చాలా ఎమోషనల్ క్షణం. చాలా సేపు జైస్వాల్ ఏం మాట్లాడలేకపోయాడు. చివరకు నువ్వు హ్యాపీనా నాన్నా? అని అడిగాడు' అని భూపేంద్ర తెలిపాడు. ఐపీఎల్తో గుర్తింపు తెచ్చుకున్న జైస్వాల్ ఈ ఏడాది సూపర్ ఫామ్తో టీమిండియాలోకి దూసుకొచ్చిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత మాట్లాడిన జైస్వాల్.. 'నేను చిన్నతనంలో దేశానికి ఆడాలని కలలు కనేవాడిని. ఇప్పుడు అది నిజం అవడం చాలా ఎమోషనల్ మూమెంట్. కానీ ఇది కేవలం ఆరంభం మాత్రమే. నా ఈ ప్రయాణంలో చాలా మంది సహకారం ఉంది. వాళ్లందరికీ ధన్యవాదాలు చెప్పాలని అనుకుంటున్నా. నాపై నమ్మకం ఉంచిన సెలెక్టర్లు, కెప్టెన్కు రుణపడి ఉంటా' అని జైస్వాల్ పేర్కొన్నాడు.