వైజాగ్ వేదికగా జరుగుతున్న భారత్- ఇంగ్లండ్ రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 396 పరుగుల భారీ స్కోరు సాధించింది. యశస్వీ జైస్వాల్ (209; 290 బంతుల్లో) డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. ఓవర్నైట్ స్కోరు 336/6తో శనివారం ఆటను ప్రారంభించిన టీమిండియా మరో 60 పరుగులే చేసింది. 400 మార్క్ను అందుకోకుండా ఇంగ్లండ్ బౌలర్లు కట్టడిచేశారు.
అనంతరం బ్యాటింగ్కు వచ్చిన ఇంగ్లండ్ దూకుడుగా ఆడడుతోంది. ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్ బజ్బాల్ అప్రోచ్తో పరుగులు సాధిస్తున్నారు. 8.3 ఓవర్లలోనే ఆ జట్టు 50 పరుగులు చేసింది. అయితే అ'ద్వితీయ'మైన ఇన్నింగ్స్ ఆడిన జైస్వాల్ పలు రికార్డులు బద్దలుకొట్టాడు. అందులో ఓ అరుదైన రికార్డు సాధించాడు. క్రికెట్ చరిత్రలో ఈ రికార్డు నమోదవ్వడం ఇది కేవలం రెండో సారి మాత్రమే.

భారత్ ఇన్నింగ్స్లో జైస్వాల్ తర్వాత అత్యధిక స్కోరు 34 పరుగులే. శుభ్మన్ గిల్ 46 బంతుల్లో 34 పరుగులు చేశాడు. అయితే టెస్టుల్లో తన సహచరులు 34 కంటే ఎక్కువ పరుగులు చేయకుండా ఓ బ్యాటర్ డబుల్ సెంచరీ సాధించడం క్రికెట్ చరిత్రలో ఇది రెండో సారి. 2005లో జైస్వాల్ తరహా ప్రదర్శన బ్రయాన్ లారా చేశాడు. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో లారా 226 పరుగులు బాదాడు. వెస్టిండీస్ 405 పరుగులు సాధించగా తమ బ్యాటర్లలో రెండో అత్యధిక స్కోరు బ్రావో చేసిన 34 పరుగులే కావడం గమనార్హం. ఇప్పుడు 19 ఏళ్ల తర్వాత లారా రికార్డును జైస్వాల్ సాధించాడు.
అంతేగాక భారత్ తరఫున డబుల్ సెంచరీ సాధించిన మూడో పిన్నవయస్కుడిగా యశస్వీ జైస్వాల్ రికార్డులకెక్కాడు. జైస్వాల్ వయసు 22 ఏళ్ల 37 రోజులు. టీమిండియా తరఫున ద్విశతకం సాధించిన అత్యంత తక్కువ వయస్సు ఆటగాళ్ల జాబితాలో తొలి రెండు స్థానాల్లో వినోద్ కాంబ్లీ ఉన్నాడు. 1993లో ఇంగ్లండ్పై (21 ఏళ్ల 35 రోజులు), జింబాబ్వే (21 ఏళ్ల 55 రోజులు) కాంబ్లీ డబుల్ సెంచరీలు బాదాడు. ఆ తర్వాత సునీల్ గవాస్కర్ తన 21 ఏళ్ల 283 రోజుల వయసులో వెస్టిండీస్పై 220 పరుగులు సాధించాడు.
అలాగే భారత్ తరఫున డబుల్ సెంచరీ సాధించిన నాలుగో లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్గా జైస్వాల్ రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు ఎడమచేతి వాటం బ్యాటర్లలో సౌరవ్ గంగూలీ (239 పరుగులు, పాకిస్థాన్పై), వినోద్ కాంబ్లీ (227; జింబాబ్వేపై, 224, ఇంగ్లండ్పై), గౌతమ్ గంభీర్ (206, ఆస్ట్రేలియాపై) మాత్రమే ఈ ఘనత సాధించారు. జైస్వాల్ మరో రికార్డు సాధించాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్లో డబుల్ సెంచరీ సాధించిన నాలుగో టీమిండియా ప్లేయర్గా నిలిచాడు.ఈ ఘనతను అంతకుముందు విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ సాధించారు.