జైపుర్ వేదికగా ముంబై ఇండియన్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. తిలక్ వర్మ (63; 45 బంతుల్లో, 5x4, 3x6), నెహాల్ వదేరా (49; 24 బంతుల్లో, 3x4, 4x6) టాప్ స్కోరర్లు. సందీప్ శర్మ అయిదు వికెట్లతో (5/18)తో చెలరేగాడు.
అనంతరం రాజస్థాన్ రాయల్స్ 18.4 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. యశస్వీ జైస్వాల్ (104*; 60 బంతుల్లో, 9x4, 7x6) అజేయం శతకంతో అదరగొట్టాడు. సంజు శాంసన్ (38*; 28 బంతుల్లో, 2x4, 2x6) ఆకట్టుకున్నాడు. కాగా, ఐపీఎల్లో జైస్వాల్కు ఇది రెండో సెంచరీ. గత సీజన్లో తొలి సెంచరీ సాధించాడు.

అయితే జైస్వాల్ తన తొలి సెంచరీ కూడా ముంబై ఇండియన్స్పై సాధించాడు. దీంతో మ్యాచ్ అనంతరం దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. జైస్వాల్ను సరదాగా ప్రశ్నించాడు. ''ముంబై ఇండియన్స్పై నీకు ఇది రెండో సెంచరీ. వాళ్లపైనే ప్రత్యేకంగా ఈ సెంచరీలు చేయడమేంటి? ఇతర టీమ్స్పై నువ్వు శతకాలు సాధించవా'' అని గవాస్కర్ ఫన్నీగా అడిగాడు.
దానికి జైస్వాల్ స్పందిస్తూ.. ''అలా ఏం లేదు. మెరుగ్గా రాణించాలనే ప్రయ్నతిస్తుంటా. కొన్ని రోజులు కఠినంగా ఉంటాయి. మరికొన్ని రోజులు బాగుంటాయి. ఆడటంపైనే ఫోకస్ చేస్తా. మిగిలిన విషయాలను ఏం ఆలోచించను'' అని పేర్కొన్నాడు. కాగా, ఐపీఎల్లో ఓ జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో అతడు రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో కేఎల్ రాహుల్ ఉన్నాడు. రాహుల్ ముంబైపై ఏకంగా మూడు సెంచరీలు చేశాడు. క్రిస్ గేల్ (పంజాబ్ కింగ్స్పై), విరాట్ కోహ్లి (గుజరాత్ టైటాన్స్పై), డేవిడ్ వార్నర్ (కేకేఆర్పై), బట్లర్ (కేకేఆర్పై), బట్లర్ (ఆర్సీబీపై)తో కలిసి జైస్వాల్ ఉమ్మడిగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.