
18 నెలల్లో టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తానని ఓ కుర్ర క్రికెటర్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అతనెవరో కాదు ఇటీవల అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన భారత యువ జట్టు కెప్టెన్ యష్ ధూల్. యువ జట్టును ప్రపంచప్ గెలిపించడానికి తోడు ఢిల్లీ రంజీ జట్టు నుంచి పిలుపు కూడా రావడంతో యష్ ధూల్ తెగ ఖుషీ అయిపోతున్నాడు. దీనికి తోడు త్వరలో జరగనున్న ఐపీఎల్ 2022 మెగా వేలంలో యష్ ధూల్ కూడా పాల్గొంటున్నాడు. ప్రస్తుతం అతనికున్న క్రేజ్, ఫామ్ దృష్యా మెగా వేలంలో యష్ ధూల్ అమ్ముడుపోవడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. బహుషా ఇవన్ని ఇచ్చిన ఆత్మ విశ్వాసంతో కావొచ్చు మరో 18 నెలల్లో టీమిండియాలో చోటు సంపాదిస్తానని యష్ ధూల్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
త్వరలో జరగనున్న రంజీ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ రంజీ జట్టుకు ఎంపికైన సందర్భంగా ఓ క్రీడా చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యష్ ధూల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఒక వేళ 18 నెలల్లో టీమిండియాలోకి రాలేకపోతే మరింతంగా శ్రమిస్తానని, భారత జట్టులో చోటు సంపాదించుకోవడం కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఇందుకు తన కుటుంబసభ్యులు కూడా సిద్ధంగా ఉన్నారని ధూల్ తెలిపాడు. టీమిండియా వెటరన్ ఆటగాడు విరాట్ కోహ్లీని విపరీతంగా ఆరాధిస్తానని, అతన్ని రెగ్యూలర్గా ఫాలో అవుతానని చెప్పాడు. కోహ్లీ లాగే తన కెరీర్ ప్లాన్ చేసుకుంటానని తెలిపాడు. ఇక తాను భవిష్యత్ గురించి ఎక్కువగా ఆలోచించడం లేదని, వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ ముందుకు సాగడమే తన లక్ష్యమన్నాడు.
ప్రపంచకప్ గెలిచాక కోహ్లీతో మాట్లాడినప్పుడు, అతడు తాను అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన నాటి అనుభవాలను తనతో పంచుకున్నట్లు ధూల్ తెలిపాడు. కాగా టీమిండియాకు అండర్ 19 ప్రపంచకప్ అందించిన మూడో ఢిల్లీ ఆటగాడు యష్ ధూల్. అతని కంటే ముందు ఢిల్లీ నుంచి విరాట్ కోహ్లీ, ఉన్ముక్త్ చంద్ భారత్కు అండర్ 19 ప్రపంచకప్ అందించారు. కోహ్లీ టీమిండియాలో స్టార్ ఆటగాడిగా ఎదగగా.. ఉన్ముక్త్ చంద్ కనుమరుగైపోయాడు. దీంతో యష్ ధూల్ భవిష్యత్ ఎలా ఉంటుందోననే ఆసక్తి నెలకొంది.