
హైదరాబాద్: క్రికెట్ అభిమానులను అలరించేందుకు అంతర్జాతీయ క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు మరోసారి ఒకే వేదికపై తమ సత్తాచాటేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ క్రికెట్ మైదానం వేదికకానుంది. ఐసీసీ వరల్డ్ లెవెన్, వెస్టిండీస్ జట్లు గురువారం జరిగే ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్లో తలపడనున్నాయి.
భారత కాలమాన ప్రకారం గురువారం రాత్రి 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ ద్వారా వచ్చే నిధులను వెస్టిండీస్లోని క్రికెట్ మైదానాల పునరుద్ధరణ పనులకు ఉపయోగించనున్నారు. గతేడాది ఇర్మా తుఫాను వల్ల కరేబియన్ దీవుల్లోని ఐదు క్రికెట్ మైదానాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
ఆంగ్విలాలోని రొనాల్డ్ వెబ్స్టర్ పార్క్, ఆంటిగ్వాలోని సర్ వివ్ రిచర్డ్స్ స్టేడియం, డొమినికాలోని విన్డ్సర్ పార్క్ స్టేడియం, బీవీఐలోని షిర్లే రిక్రియేషన్ గ్రౌండ్, సెయింట్ మార్టిన్లోని కారిబ్ లంబర్ బాల్ పార్క్ మైదానాలు తుపాను దాటికి దెబ్బతిన్నాయి. వీటిని పునరుద్ధరించేందుకు అవసరమైన నిధులను సేకరించేందుకు ఈ మ్యాచ్ ఆడుతున్నారు.
'హరికేన్ రిలీఫ్ టీ20 ఛాలెంజ్' పేరిట వెస్టిండిస్తో జరిగే టీ20 ఎగ్జిబిషన్ మ్యాచ్లో వరల్డ్ ఎలెవన్ జట్టు కెప్టెన్గా ఇయాన్ మోర్గాన్ స్థానంలో పాక్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది నాయకత్వం వహించనున్నాడు. సోమర్సెట్తో జరిగిన కౌంటీ మ్యాచ్లో మిడిలెసెక్స్ తరఫున బరిలోకి దిగిన ఇయాన్ మోర్గాన్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు.
కుడిచేతి వేలుకు గాయం కావడంతో విండిస్తో జరగనున్న ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్కి ఐసీసీ అంతర్జాతీయ హోదా ఇచ్చిన సంగతి తెలిసిందే.
వరల్డ్ లెవన్:
షాహిద్ అఫ్రీది (కెప్టెన్), సామ్బిల్లింగ్స్ (కీపర్), సామ్ కుర్రాన్, తమీమ్ ఇక్బాల్, టైమల్ మిల్స్, దినేశ్ కార్తీక్ (కీపర్), రషీద్ ఖాన్, సందీప్ లామిచానె, మిచెల్లి మెక్లెనగన్, షోయబ్ మాలిక్, తిసారా పెరీర, లూక్ రోంచి (కీపర్), ఆదిల్ రషీద్.
వెస్టిండీస్:
కార్లోస్ బ్రాత్వైట్ (కెప్టెన్), శామ్యూల్ బద్రీ, ఎమ్రిత్, ఆండ్రీ ఫ్లెచర్, క్రిస్ గేల్, ఎవిన్ లూయిస్, ఆష్లే నర్స్, కీమో పాల్, రోవ్మన్ పొవెల్, దినేశ్ రామ్దిన్ (కీపర్), ఆండ్రీ రస్సెల్, మార్లోన్ శామ్యూల్స్, కెస్రిక్ విలియమ్స్.