హైదరాబాద్: మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో విరాట్ కోహ్లీ ఒకడు. ఈ మధ్య కాలంలో భారత క్రికెట్ను విరాట్ కోహ్లీ ఎంతో ముందుకు తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో క్రికెట్ అంటే పెద్దగా తెలియని వారు కూడా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అభిమానులు అయిపోతున్నారు.
తాజాగా విరాట్ కోహ్లీతో కలిసి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాలని ఉందని ఐర్లాండ్ రెజ్లర్ ఫిన్ బలోర్ ఆసక్తి వ్యక్తం చేశాడు. త్వరలోనే విరాట్ కోహ్లీని కలుస్తానని, ఆ సందర్భంగా అతనితో ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతానని చెప్పాడు. కోహ్లీ ఓకే అంటే అతనితో రెజ్లింగ్ కూడా ఆడతానని నవ్వుతూ చెప్పాడు.

ఆ తర్వాత క్రికెట్లో మెళకువలు తెలుకుంటానని పేర్కొన్నాడు. నిజానికి తనకు క్రికెట్ గురించి పెద్దగా తెలియదని, అయితే ఒకసారి ఐర్లాండ్-ఆస్ట్రేలియా దేశాల మధ్య జరిగిన ఒక మ్యాచ్ను చూశానని చెప్పాడు. దీంతో క్రికెట్కు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని అనిపించిందని చెప్పుకొచ్చాడు.
భారత్-ఐర్లాండ్ దేశాల మధ్య ఒక క్రికెట్ మ్యాచ్ జరిగితే అది తనకు ఎంతో గర్వకారణమని ఫిన్ బలోర్ తెలిపాడు. గత 15 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తున్న ఫిన్ బలోర్ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్. ప్రస్తుతం ఈ ఆటకు భారత్లోని యువత ఆకర్షిలవుతోంది. కాగా, ఈ ఏడాది చివర్లో భారత్లో డబ్ల్యూడబ్ల్యూఈ టోర్నీ జరగనుంది.
డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న ఈ టోర్నీలో ఫిల్ బలోర్ రెండు రోజులు బరిలోకి దిగనున్నాడు. డిసెంబర్ 8వ తేదీన బ్రే వ్యాట్తో తలపడుతుండగా, డిసెంబర్ 9వ తేదీన కుర్టిస్ యాక్సల్తో తలపడనున్నాడు. దీనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు.