హైదరాబాద్: మంచి భాగస్వామ్యాలను నెలకొల్పినప్పుడే మ్యాచ్ మన సొంతం అవుతుందని భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ పేర్కొంది. ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్లో భాగంగా బుధవారం మిథాలీ సేన శ్రీలంకతో తలపడనుంది.
ఈ సందర్భంగా కెప్టెన్ మిథాలీ రాజ్ మీడియాతో మాట్లాడింది. 'వికెట్లు కోల్పోకుండా మంచి భాగస్వామ్యాలను నమోదు చేయాలి. అప్పుడే ప్రత్యర్ధి బౌలర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారు. పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. గత చివరి రెండు గేముల్లో పేసర్లు అద్భుతంగా రాణించారు' అని మిథాలీ పేర్కొంది.

నిజానికి తొలి పది ఓవర్లలో వికెట్ పోతే ఒత్తిడి ఉంటుందని, అవసరమైన భాగస్వామ్యాలు నిర్మించినా వెంటవెంటనే వికెట్లు కోల్పోవడం ఒత్తిడిలోకి నెట్టిందని పాక్తో జరిగిన మ్యాచ్ గురించి ఈ సందర్భంగా ప్రస్తావించింది. లక్ష్యం తక్కువే అయినా స్పిన్నర్లు డిఫెండ్ చేసిన తీరుపై మిథాలీ ప్రశంసలు కురిపించింది.
చివర్లో సుష్మ, ఝలన్ గోస్వామి చక్కగా ఆడడంతో ప్రత్యర్థి ముందు 170 లక్ష్యం ఉంచగలిగామని తెలిపింది. ప్రత్యర్థి ఎవరైనా లక్ష్యం 150 లోపైనా టాప్ ఆర్డర్ను కుప్పకూలిస్తే కోలుకోలేరని తెలుసని మిథాలీ చెప్పింది. డెర్బీ పిచ్పై స్పిన్నర్లు బాగా టర్న్ రాబట్టారు. ఇలాంటి పిచ్పై పాక్ సమర్థంగా బ్యాటింగ్ చేయలేదని తనకి తెలుసని మిథాలీ చెప్పింది.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్, పాక్ ఆదివారం తలపడ్డాయి. టీమిండియా బౌలర్ల దెబ్బకు 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 38.1 ఓవర్లకు పాక్ 74 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. దీంతో వరల్డ్ కప్లో పాకిస్థాన్పై వరుసగా భారత మహిళల జట్టు విజయం సాధించింది.