భారత జట్టులో స్టార్ క్రికెటర్ల ఆధిపత్యం పెరిగిపోయింది.. దీనికి చరమగీతం పాడాలి! గంగూలీ, ద్రవిడ్కి కోచ్ లేఖ!!

ముంబై: భారత మహిళల క్రికెట్ జట్టులో స్టార్ క్రికెటర్ల ఆధిపత్యం పెరిగిపోయిందని మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్ అన్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. జట్టులో స్టార్ల మాటే నెగ్గాలనే ఆటలు ఆగాలని రామన్ అన్నారు. మహిళా జట్టుపై తన అభిప్రాయాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్లకు ఈ మెయిల్లో తెలియజేశారట. ఏ ఒక్క క్రికెటర్ పేరు చెప్పకపోయినా.. జట్టులో ప్రస్తుతమున్న 'స్టార్ క్రికెటర్' అనే సంస్కృతి మారాలని లేఖలో సూచించినట్లు తెలిసింది.

స్టార్ క్రికెటర్ల వంతపాట ఆగాలి:
గత గురువారం డబ్ల్యూవీ రామన్ స్థానంలో టీమిండియా మాజీ స్పిన్నర్ రమేశ్ పవార్ని మహిళల టీమ్ చీఫ్ కోచ్గా బీసీసీఐ నియమించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే టీమిండియా దిగ్గజాలు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్కి భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్ ఒక ఈ మెయిల్ పంపినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళా జట్టులో కొంత మంది క్రికెటర్ల ఆధిపత్యం పెరిగిపోయిందని, జట్టుకి మించి ఎవరూ ఎక్కువ కాకూడదని లేఖలో స్పష్టం చేశారట. ఇప్పటికైనా స్టార్ కల్చర్కి స్వస్తి పలకాలని సూచించినట్లు సమాచారం. జట్టుని మళ్లీ గాడిన పెట్టేందుకు అవసరమైతే తాను రోడ్ మ్యాప్ని సిద్ధం చేస్తానని రామన్ మెయిల్లో పేర్కొన్నారట.

ఆ విమర్శలు మిథాలీపైనేనా:
బోర్డు అధ్యక్షుడికి మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్ ఈ మెయిల్ పంపింది నిజమేనని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. దీనిపై బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆ అధికారి తెలిపారు. మొత్తం మీద సీనియర్ క్రికెటర్, హైదరాబాదీ స్టార్ మిథాలీ రాజ్ మళ్లీ వార్తల్లో నిలిచినట్లయింది. పేరు చెప్పకపోయినా ఇప్పుడు అందరికళ్లూ మిథాలీపైనే కేంద్రీకృతమయ్యాయి. రెండేళ్ల క్రితం కోచ్గా ఉన్న రమేశ్ పవార్పై తీవ్రస్థాయిలో మిథాలీ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. 2018లో కోచ్గా పనిచేసిన పొవార్.. మిథాలీతో వివాదం కారణంగా పదవి నుంచి వైదొలిగాడు.

మంచి వాతావరణం ఉంటుందా?:
రమేష్ పొవార్నే మరోసారి మహిళా జట్టును ఎంపిక చేసిన నేపథ్యంలో.. అతనికి, మిథాలీకి మధ్య మంచి వాతావరణం ఉంటుందా? అనే ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతున్నాయి. ఈ విషయంపై భారత క్రికెట్ సలహా కమిటీ మెంబెర్ మదన్ లాల్ కూడా స్పందించారు. 'మిథాలీతో వివాదం గురించి ముఖాముఖిలో పొవార్ను అడిగాం. అందులో తన తప్పేమీ లేదని అతను చెప్పాడు. క్రికెటర్లందరితో కలిసి పని చేయడానికి సిద్ధంగానే ఉన్నానని మాకు స్పష్టం చేశాడు' అని మదన్ లాల్ పేర్కొన్నారు.

టెస్ట్, వన్డేల్లో మిథాలీ నాయకత్వం:
రాబోయే సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటన కోసం భారత మహిళల జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. ప్రతి ఫార్మాట్ (టెస్ట్, వన్డే, టీ20)కు 18 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. టెస్ట్, వన్డే జట్లకు మిథాలీ రాజ్ నాయకత్వం వహించనుండగా.. టీ20 జట్టుకు హర్మన్ప్రీత్ కౌర్ సారథిగా ఎంపికయింది. వికెట్ కీపర్-బ్యాటర్ ఇంద్రాణి రాయ్కు తొలిసారి టెస్ట్, వన్డే జట్టులో చోటు దక్కింది. ఇంగ్లండ్ పర్యటనలో భారత్ ఒక టెస్ట్, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. జూన్ 16-19 వరకు బ్రిస్టల్లో ఏకైక టెస్ట్ మ్యాచ్ జరగనుంది. జూన్ 27న వన్డే సిరీస్, జూలై 9న టీ20 సిరీస్ ప్రారంభం కానున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications