న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో మూడు టెస్ట్ల సిరీస్ను 2-1 తేడాతో చేజార్చుకున్న టీమిండియా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లోనూ కిందకి పడిపోయింది. కేప్టౌన్ వేదికగా శుక్రవారం ముగిసిన మూడో టెస్టులో 7 వికెట్ల తేడాతో ఓడిన టీమిండియా.. సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచి సువర్ణవకాశాన్ని చేజార్చుకుంది. మూడు దశాబ్దాలుగా సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవని టీమిండియా.. కేప్టౌన్లోనూ చెత్తరికార్డును కొనసాగించింది. 1992 నుంచి టెస్టుల్లో గెలిచింది లేదు.
డిసెంబర్ చివరి వారంలో సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 113 పరుగుల తేడాతో గెలిచిన భారత్.. గత వారం జొహన్నెస్బర్గ్లో ముగిసిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈరోజు కేప్టౌన్ టెస్టులో 7 వికెట్ల తేడాతో ఓడటం ద్వారా సిరీస్ని చేజార్చుకుంది. దాంతో.. ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలోనూ నాలుగో స్థానం నుంచి ఐదో స్థానానికి భారత్ పడిపోగా.. సౌతాఫ్రికా ఐదు నుంచి నాలుగుకి ఎగబాకింది.
2021, జులై తర్వాత ఇప్పటి వరకూ మూడు టెస్టు సిరీస్లు ఆడిన భారత్ జట్టు.. ఈ క్రమంలో 9 మ్యాచ్లను ఆడింది. ఇందులో నాలుగు మ్యాచ్ల్లో గెలిచి.. మూడింట్లో ఓడి.. రెండింటిని డ్రాగా ముగించింది. దాంతో.. మొత్తం 53 పాయింట్లని సాధించిన భారత్ 49.07 విజయాల శాతంతో ఐదో స్థానంలో కొనసాగుతుంది. మరోవైపు సౌతాఫ్రికాకు ఇదే మొదటి సిరీస్ కాగా.. మూడు మ్యాచ్ల్లో ఆడి రెండింటిలో గెలిచింది. ఆ జట్టు గెలుపు శాతం 66.66. దాంతో.. భారత్ కంటే మెరుగైన ర్యాంక్ను సౌతాఫ్రికా చేజిక్కించుకుంది. కానీ.. ఆ జట్టు ఖాతాలో ఉన్నవి 24 పాయింట్లే. ఐసీసీ 2020 నుంచి పాయింట్ల ఆధారంగా కాకుండా గెలుపు శాతం ఆధారంగా ర్యాంక్లను కేటాయిస్తున్న విషయం తెలిసిందే.
లక్ష్యచేధనలో భాగంగా 101/2 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా అద్భుత బ్యాటింగ్తో 63.3 ఓవర్లలో 3 వికెట్లకు 212 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కీగన్ పీటర్సన్(113 బంతుల్లో 10 ఫోర్లతో 82) హాఫ్ సెంచరీతో రాణించగా.. రాసీ వాన్ డస్సెన్(95 బంతుల్లో 3 ఫోర్లతో 41 నాటౌట్), టెంబా బవుమా(58 బంతుల్లో 5 ఫోర్లతో 32 నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీశారు.