ఐపీఎల్ చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో క్రికెట్ ప్రేమికుల ఫోకస్ అంతా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) వైపు వెళ్తోంది. ఈ క్రమంలో టీమిండియాలో మరొక మార్పు జరుగుతోంది. టీమిండియా స్టాండ్బై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్ ఆడలేడని తెలుస్తోంది.
ఈ 26 ఏళ్ల కుర్రాడు వచ్చే నెలలోనే వివాహం చేసుకోబోతున్నాడట. జూన్ 3-4 తేదీల్లో గైక్వాడ్ పెళ్లి ఉందని తెలుస్తోంది. దీంతో అతను జూన్ 5కు ముందు లండన్ చేరుకోవడం జరగదని తెలుస్తోంది. అతన్ని బీసీసీఐ బ్యాకప్ ఓపెనర్గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే అతను ఈ మ్యాచ్ కోసం లండన్ చేరుకోలేడు.

ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం అతని స్థానంలో మరో సబ్స్టిట్యూట్ కావాలని టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ కోరాడట. దీంతో బీసీసీఐ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ను లండన్ పంపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే లండన్ వెళ్లనున్న యశస్వి.. అక్కడ టీమిండియాతో కలుస్తాడని సమాచారం.
రుతురాజ్ త్వరలోనే తన స్నేహితురాలు ఉత్కర్ష అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. 'పెళ్లి ఉండటంతో తను లండన్ వెళ్లలేనని రుతురాజ్ మాక ఇన్ఫామ్ చేశాడు. దీంతో అతని స్థానంలో జైస్వాల్ అక్కడకు వెళ్లి టీంతో కలుస్తాడు. జూన్ 5 తర్వాత అయితే రుతురాజ్ జట్టుతో కలిసే అవకాశం ఉంది. కానీ రాహుల్ కాల్ చేసి అతని స్థానంలో రిప్లేస్మెంట్ అడగడంతో ఈ నిర్నయం తీసుకున్నాం' అని బీసీసీఐ అధికారులు చెప్తున్నారు.
త్వరలోనే యశస్వి లండన్ విమానం ఎక్కుతాడని సమాచారం. ఈ ఐపీఎల్ సీజన్లో యశస్వి జైస్వాల్ అద్భుతంగా రాణించాడు. అతను 14 మ్యాచుల్లో 625 పరుగులతో రాణించాడు. రాజస్థాన్కు దాదాపు అన్ని మ్యాచుల్లో అద్భుతమైన ఓపెనింగ్లు అందించాడు. మంచి టచ్లో ఉన్న అతనికి యూకే వీసా ఇప్పటికే ఉంది. ఈ క్రమంలోనే రెడ్ బాల్ క్రికెట్ కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టాలని బీసీసీఐ సూచించినట్లు తెలుస్తోంది.