ఐపీఎల్లో అదరగొట్టిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్కు టీమిండియా నుంచి పిలుపు అందిన సంగతి తెలిసిందే. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడే జట్టులో స్టాండ్ బై ప్లేయర్గా జైస్వాల్కు అవకాశం వచ్చింది. రుతురాజ్ గైక్వాడ్ పెళ్లి ఉండటంతో అతని స్థానాన్ని జైస్వాల్తో భర్తీ చేయడం జరిగింది.
ఈ విషయాన్ని తాజాగా జైస్వాల్ ధ్రువీకరించాడు. ఐపీఎల్ రెండో క్వాలిఫైయర్లో ఓటమి తర్వాత ముంబై ఇండియన్స్ టీంలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు కూడా ఇంగ్లండ్ బయలు దేరారు. ఈ క్రమంలోనే కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి జైస్వాల్ కూడా విమానం ఎక్కాడు. ఈ సందర్భంగా రోహిత్తో కలిసి సెల్ఫీ దిగిన అతను దాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

'వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ఇంగ్లండ్కు వెళ్తున్నా. అది కూడా నేను నమ్మే రోహిత్ శర్మతో కలిసి' అని తన ఫొటోకు క్యాప్షన్ పెట్టాడీ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్. ఈ ఏడాది ఐపీఎల్లో జైస్వాల్ అద్భుతంగా ఆడాడు. మొత్తం 14 మ్యాచులు ఆడిన అతను 163.61 స్ట్రైక్ రేటుతో 625 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్గా రికార్డు సృష్టించాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే భారత జట్టులో తాజాగా వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే. దేశవాళీల్లో రాణించిన అతను ఐపీఎల్లో కూడా సత్తా చాటడంతో మళ్లీ టెస్టు జట్టులోకి పిలుపు అందుకున్నాడు. అయితే ఈ మ్యాచ్లో రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్ వంటి కీలకమైన ప్లేయర్లు భారత జట్టుకు దూరమవడం గమనార్హం.
డబ్ల్యూటీసీ ఫైనల్కు ఎంపికైన భారత బృందం (అప్డేటెడ్):
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్
స్టాండ్ బై ప్లేయర్లు: యశస్వి జైస్వాల్, ముఖేష్ కుమార్, సూర్యకుమార్ యాదవ్