డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్ చేరుకుంటోంది. ఇప్పటికే కోహ్లీ సహా కొందరు కీలక ఆటగాళ్లు అక్కడకు వెళ్లిపోయారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ తదితరులు కూడా అక్కడకు వెళ్తారు. ఈ క్రమంలో అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఒకటే.
డబ్ల్యూటీసీ ఫైనల్ వంటి కీలకమైన మ్యాచ్లో కీపర్గా ఎవరిని ఆడించాలి? భారత్ వద్ద కేఎస్ భరత్, ఇషాన్ కిషన్ రూపంలో రెండు ఆప్షన్లు ఉన్నాయి. వీరిలో కేఎస్ భరత్.. ఐపీఎల్ ముందు జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అన్ని మ్యాచులు ఆడాడు. కానీ బ్యాటుతో పెద్దగా ఆకట్టుకోలేదు. మరి అతని స్థానంలో కిషన్ను ఆడిస్తారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

తాజాగా ఇదే విషయంపై మాట్లాడిన టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ మొత్తం ఆడిన భరత్కే ఈ డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా చోటు దక్కుతుందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో కిషన్ను ఆడిస్తే భారత మిడిలార్డర్ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉందన్నాడు.
'ఒకవేళ ఇద్దరు స్పిన్నర్లు ఆడుతుంటే.. భరత్ను ఆడించాలి. అసలు ఇద్దరిలో మంచి కీపర్ ఎవరని చూడాలి. అయితే ఆస్ట్రేలియాతో సిరీస్లో భరత్కు పూర్తిగా అవకాశం లభించింది. అతను అన్ని టెస్టుల్లో ఆడాడు. కాబట్టి అతనే ఈ మ్యాచ్లో కూడా ఫస్ట్ చాయిస్ అని అనుకుంటున్నా' అని రవిశాస్త్రి వివరించాడు.
ఈ మ్యాచ్ ఆడే 11 మంది ఆటగాళ్లు ఎవరని రవిశాస్త్రి తాజాగా అంచనా వేశాడు. దీనిలో కూడా భరత్కే శాస్త్రి చోటు కల్పించాడు. ఆస్ట్రేలియా సిరీస్లోనే అరంగేట్రం చేసిన కేఎస్ భరత్ ఆరు ఇన్నింగ్సుల్లో బ్యాటింగ్ చేసి 101 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఆ సిరీస్లో మిగతా బ్యాటర్లు కూడా చాలా తడబడ్డారు. అదే సమయంలో ర్యాంక్ టర్నర్ పిచ్లపై కూడా కీపింగ్తో భరత్ ఆకట్టుకున్నాడు.
'ఈ విషయంలో ఆలోచించడానికి పెద్దగా ఏం లేదు. వీళ్లిద్దరి స్కిల్స్ మధ్య భారీ గ్యాప్ ఉందని నేను అనుకోవడం లేదు. బ్యాటింగ్ కూడా ఎవరిని ఆడించాలనే నిర్ణయంపై ప్రభావం చూపుతుంది. మిడిలార్డర్లో కిషన్ బ్యాటింగ్ కావాలి అనుకుంటే అతన్నే ఆడిస్తారు. అదే నలుగురు పేసర్లతో బరిలో దిగితే అప్పుడు స్పిన్నర్లు ఉండరు కాబట్టి.. మంచి కీపర్ ఉంటే చాలు' అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.