డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఆస్ట్రేలియా, భారత్ రెండు జట్లు రెడీ అవుతున్నాయి. ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి ట్రోఫీ అందుకోవాలని కసిగా ఉన్నాయి. అయితే టెస్టు క్రికెట్లో ఎలాంటి ఫలితమైనా సాధ్యమే. ఫలితం కోసం రెండు జట్లు ప్రయత్నించినా కూడా మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు లేకపోలేదు.
ఒకవేళ అదే జరిగి ఈ మ్యాచ్ డ్రా అయిందని అనుకుందాం. అప్పుడు ట్రోఫీ ఎవరికి దక్కుతుంది? డబ్ల్యూటీసీ సైకిల్లో అత్యధిక పాయింట్లతో జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియాకేనా? అని కొందరు అనుమానిస్తున్నారు. అదే సమయంలో వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన భారత్కు ట్రోఫీ ఇస్తారా? అని అడుగుతున్నారు. క్లియర్గా చెప్పాలంటే ఈ రెండూ జరగవు.

మ్యాచ్ కనుక డ్రా అయితే.. పాయింట్ల పట్టికలో టాప్లో ఉంది కదా అని ఆసీస్కు ట్రోఫీ ఇవ్వడం జరగదు. అలాగే రెండోసారి ఫైనలిస్టు కదా అని భారత్కు కూడా ఇవ్వరు. రెండు జట్లను జాయింట్ విన్నర్లుగా ప్రకటిస్తారు. అలాగే ఒకవేళ వర్షం పడి మ్యాచ్లో ఎక్కువభాగం కోల్పోతే దానికి కూడా మరో ఆప్షన్ ఉంది.
ఈ మ్యాచ్ కోసం మరో రిజర్వ్ డేను కూడా సెలెక్ట్ చేశారు. కాబట్టి ఒకవేళ మ్యాచ్ ఏ కారణం వల్లనైనా టైం కోల్పోతే, ఆ టైంను రిజర్వ్ డేలో కవర్ చేస్తారు. లెక్కల ప్రకారం, మ్యాచ్ జరిగే ఐదు రోజుల్లో సగటున ఆరు గంటలపాటు మ్యాచ్ జరగాలి. లేదా రోజుకు 90 ఓవర్లు అని కూడా చెప్పొచ్చు. ఇది ఏమాత్రం అటూ ఇటూ అయినా.. రిజర్వ్ డే రోజున ఆ టైం కవర్ చేస్తారట.

ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని భారత జట్టు కూడా గట్టిగా ప్రయత్నిస్తోంది. గత డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా తలపడిన టీమిండియా.. న్యూజిల్యాండ్ చేతిలో ఏకంగా 8 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. లేదంటే అప్పుడే భారత్ ఈ ట్రోఫీ నెగ్గాల్సింది. ఈసారైనా ఆ కలను నిజం చేసుకోవాలని భారత జట్టు భావిస్తోంది.