ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే చెలరేగే టీమిండియా స్టార్స్లో విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు. ఫార్మాట్ ఏదైనా కంగారూలపై రెచ్చిపోవడం కోహ్లీకి అలవాటు. ఇక తనకు ఎంతో ఇష్టమైన టెస్టు ఫార్మాట్లో కూడా ఈ లెక్కలు బాగానే ఉన్నాయి. ఇప్పటి వరకు ఆస్ట్రేలియాపై 24 టెస్టుల్లో కోహ్లీ బ్యాటింగ్ చేశాడు.
ఈ మ్యాచులు అన్నీ కలిపి 48.26 సగటుతో 1979 పరుగులు చేశాడు. ఇదే విషయాన్ని డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు ఆసీస్ మాజీ లెజెండ్ గ్రెగ్ చాపెల్ గుర్తుచేస్తున్నాడు. 'ఆస్ట్రేలియన్లపై బ్యాటింగ్ చేయడాన్ని విరాట్ కోహ్లీ తెగ ఇష్టపడతాడు. అది ఆస్ట్రేలియా గడ్డపై అయినా.. ఇంకెక్కడైనా సరే. అతని రికార్డులు చూస్తేనే ఈ విషయంలో కోహ్లీ ఎంత అద్భుతంగా ఆడతాడో తెలిసిపోతుంది' అని ఛాపెల్ అన్నాడు.

'కోహ్లీ ఎప్పుడూ ఫైట్ చేయకుండా ఓటమిని ఒప్పుకునే రకం కాదు. ఇక ఓవల్ పిచ్పై నా అనుభవాన్ని బట్టి చూస్తే పేస్, బౌన్స్ రెండూ ఉంటాయి. ఈ పరిస్థితులు కూడా విరాట్కు బాగా కలిసొస్తాయి. ఇక ఇక్కడి వాతావరణం కూడా చాలా పొడిగా ఉందని తెలుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే ఓవల్ పిచ్ కూడా ఆస్ట్రేలియా పిచ్లకు దగ్గరగా ఉంటుంది' అని ఛాపెల్ చెప్పాడు.
ఇక పిచ్ కనుక ఆసీస్ పిచ్లా ఉంటే.. కోహ్లీ చెలరేగుతాడని చాపెల్ అంటున్నాడు. 'విరాట్ కనుక మెంటల్గా స్విచాన్ అయితే మాత్రం భారత్ తరఫున అతను భారీగా పరుగులు చేస్తాడు. తను చాలా మంచి ప్లేయర్. మ్యాచ్ను మార్చేయగల సమర్థుడు' అని మెచ్చుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం విరాట్ కోహ్లీ చాలా కష్టపడి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఎలాగైనా సరే భారత్కు డబ్ల్యూటీసీ ట్రోఫీ అందించాలని అతను ఫిక్స్ అయిపోయినగ్లు కనిపిస్తోంది. మరి కోహ్లీ ఏం చేస్తాడో?