వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన భారత జట్టు ఈసారి ఎలాగైనా ట్రోఫీ నెగ్గాలని పట్టుదలగా ఉంది. ఇంగ్లండ్లోని ఓవల్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో గెలవాలంటే భారత బౌలర్లు కూడా తమ ఆటతో మెప్పించాలి. ముఖ్యంగా పేసర్లు రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే విషయాన్ని ఆసీస్ లెజెండ్ రికీ పాంటింగ్ కూడా చెప్పాడు.
భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నుకు శస్త్రచికిత్స జరగడంతో ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత పేస్ దళానికి వెటరన్ మహమ్మద్ షమీ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే షమీ తప్పనిసరిగా రాణించాల్సిన అవసరం ఉంది. రికీ పాంటింగ్ కూడా ఇదే అన్నాడు.

'మహమ్మద్ షమీ తన బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చి, తన ఆటను మరో స్థాయికి తీసుకెళ్తే ఈ మ్యాచ్లో భారత్ గెలవడం సులభం. ఆస్ట్రేలియా బ్యాటర్లతో మాట్లాడినా కూడా షమీ ఎంత అద్భుతమైన బౌలరో తెలుస్తుంది. వాళ్లే చెప్తారు. కొత్త బంతితో అయినా, బంతి పాతబడిన తర్వాత అయినా సరే.. షమీ చాలా ప్రమాదకరం. అది ఇండియాలో అయినా, ఆస్ట్రేలియాలో అయినా' అని పాంటింగ్ చెప్పాడు.
అలాగే ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయాల్సిందని కూడా అభిప్రాయపడ్డాడు. టెస్టులో ఆడాలంటే తన శరీరంపై చాలా భారం పడుతుందని పాండ్యా ఇటీవలే చెప్పాడు. అయితే ఇది ఒకే ఒక మ్యాచ్ కాబట్టి పాండ్యాను ఆడించాల్సిందని పాంటింగ్ అన్నాడు. ప్రస్తుతం పాండ్యా బాగా బౌలింగ్ చేస్తున్నాడని, అతను కనుక జట్టులో ఉంటే భారత్కు అతనే ఎక్స్-ఫ్యాక్టర్ అయ్యే వాడని అభిప్రాయపడ్డాడు. టెస్టుల్లో అతను ఏం చేయగలడో అయినా తెలిసేదన్నాడు. అతను ఈ మ్యాచ్పై కచ్చితంగా ప్రభావం చూపించి ఉండేవాడని పేర్కొన్నాడు.