డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం టీమిండియా గట్టిగా రెడీ అవుతోంది. ఈ మ్యాచ్ ఇంగ్లండ్లోని ది ఓవల్ స్టేడియం వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. మంచి స్వింగ్, బౌన్స్ ఉండే ఈ స్టేడియంలో క్యాచులు అందుకోవడం అంత ఈజీ కాదు. బంతి మనం అనుకున్న వైపుగా రాదు. దాన్ని పట్టుకునే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.
ఈ క్రమంలోనే టీమిండియా ప్రత్యేకమైన శిక్షణ తీసుకుంటోంది. ఈ మ్యాచ్లో డ్యూక్ బాల్ వాడనున్నారని తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అరుండేల్ గ్రౌండ్లో టీమిండియా ప్లేయర్లు అందరూ రంగురంగులు ఉండే రబ్బర్ బాల్స్తో క్యాచులు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇలా టీమిండియా యువ సంచలనం శుభ్మన్ గిల్ క్యాచులు అందుకుంటూ కెమెరా కంటికి చిక్కాడు.

సాధారణంగా లాన్ టెన్నిస్ బాల్స్తో ఆటగాళ్లు క్యాచులు ప్రాక్టీస్ చేస్తారు. కానీ స్వింగింగ్ పరిస్థితుల్లో క్యాచులు అందుకోవడం కష్టమనే ఆలోచనతోనే టీమిండియా మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 'ఇవి ప్రత్యేకంగా తయారు చేసిన రబ్బర్ బాల్స్. మామూలుగా గల్లీ క్రికెట్లో చూసే బాల్స్ కాదు. ఫీల్డింగ్ డ్రిల్స్ కోసమే వీటిని తయారు చేస్తారు' అని ఒక ప్రముఖ ఫీల్డింగ్ కోచ్ వెల్లడించారు.
వీటిని 'రియాక్షన్ బాల్స్' అంటారని సదరు కోచ్ తెలిపారు. 'ఈ బాల్స్ను అన్ని దేశాల్లో కూడా వాడరు. ఇంగ్లండ్, న్యూజిల్యాండ్ వంటి దేశాల్లో గాలి, చలి వాతావరణంలో క్యాచులు అందుకోవడం కష్టం. అలాంటి పరిస్థితులకు అలవాటు అవడం కోసమే ఈ రియాక్షన్ బాల్స్ను వాడతారు' అని చెప్పారు.
కాగా ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో 66.67 పాయింట్లతో టేబుల్ టాపర్గా నిలిచిన ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. అదే సమయంలో 58.80 పాయింట్లతో రెండో స్థానంలో భారత్ నిలిచింది. ఈ రెండు డబ్ల్యూటీసీ ట్రోఫీ కోసం బుధవారం నుంచి మొదలయ్యే మ్యాచ్లో తలపడతాయి. గెలిచిన జట్టుకు ట్రోఫీ దక్కుతుంది.