
సౌతాంప్టన్: మూడు రోజుల కఠిన క్వారంటైన్ ఆనంతరం ఇంగ్లండ్లో భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ ప్రారంభించింది. న్యూజిలాండ్తో ప్రతిష్టాత్మక ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ జూన్ 18 నుంచి ఆరంభంకానున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత ఆటగాళ్లు మైదానంలోకి అడుగుపెట్టారు. కఠిన క్వారంటైన్ శనివారం ముగియడంతో.. ఆటగాళ్లు ఆదివారం ప్రాక్టీస్లో పూర్తిగా నిమగ్నమయ్యారు. దాదాపు మూడు వారాల తర్వాత టీమిండియాకు ఇదే తొలి ట్రైనింగ్ సెషన్ కావడంతో.. ఆటగాళ్లంతా హుషారుగా ప్రాక్టీస్లో పాల్గొన్నారు.
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తాను నెట్స్లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 'సౌతాంప్టన్లో మొదటి ప్రాక్టీస్' అంటూ కెప్టెన్ ఇచ్చాడు. ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి అడుగుపెట్టిన హైదరాబాద్ గల్లీ బాయ్ మహ్మద్ సిరాజ్ కూడా బౌలింగ్ సాధన చేస్తూ కనిపించాడు. వీరితో పాటు మరికొందరు టీమిండియా క్రికెటర్లు నెట్స్లో బిజీగా గడిపారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో కఠిన సాధన చేశారు. సాధనకు సంబందించిన పోటోలను పలువురు ఇండియన్ ప్లేయర్స్ తమ సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేశారు.
భారత నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా ఏజీస్ బౌల్ స్టేడియాన్ని ఫొటో తీసి తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'సాధనకు ఇదే సరైన వేదిక' అని రాసుకొచ్చింది. ఏజీస్ బౌల్ స్టేడియానికి ఆనుకోని ఉన్న హిల్టన్ హోటల్లో కోహ్లీసేన బస చేస్తున్నది. ముంబైలో రెండు వారాల క్వారంటైన్ తర్వాత భారత ఆటగాళ్లు జూన్ 3న ఇంగ్లండ్కు చేరుకున్న విషయం తెలిసిందే. ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు మూడు రోజుల పాటు హోటల్ గదుల్లోనే ఐసోలేషన్లో ఉన్నారు.
జూన్ 18 నుంచి సౌథాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ప్రారంభం కానుంది. ఇంగ్లీష్ గడ్డపై అడుగుపెట్టిన న్యూజిలాండ్.. ఇంగ్లండ్తో తొలి టెస్ట్లో తలపడుతుంది. ఈ మ్యాచ్ తర్వాత ఇరు జట్లు జూన్ 10న రెండో టెస్ట్లో తలపడతాయి. దీంతో ఫైనల్కు ముందు న్యూజిలాండ్కు కావాల్సిన ప్రాక్టీస్ లభించినట్లవుతుంది. మరోవైపు టీమిండియా ఇప్పుడే ప్రాక్టీస్ ఆరంభించింది. డబ్యూటీసీ ఫైనల్ ముగిసాక 42 రోజుల పాటు కోహ్లీసేన ఖాళీగా ఉంటుంది. అనంతరం ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్లో తలపడనుంది.