ఐపీఎల్లో తాజాగా ఫామ్ అందుకున్న స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీసులో వరుసగా మూడు మ్యాచుల్లో గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరిన అతను.. ఐపీఎల్ 2023ను కూడా పేలవంగానే ప్రారంభించాడు. కానీ ఇప్పుడు మళ్లీ ఫామ్ అందుకున్నాడు. చివరగా ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు.
ఈ క్రమంలోనే అతన్ని డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు పంపించాలని బీసీసీఐ భావిస్తోందట. గతేడాది అద్భుతమైన ఫామ్ కనబరిచిన అతను.. రంజీ ట్రోఫీలో కూడా ఫర్వాలేదనిపించాడు. దీంతో అతనికి టెస్టుల్లో కూడా అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావించింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో శ్రేయాస్కు గాయమవడంతో అతనికి అవకాశం ఇచ్చింది.

ఈ సమయంలో సర్ఫరాజ్ ఖాన్ వంటి టెక్నికల్ ప్లేయర్లకు చోటు ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయినా సరే సూర్యకే బీసీసీఐ ఓటు వేసింది. ఈ సిరీస్ తొలి టెస్టులో ఒక్క ఇన్నింగ్స్లోనే అతను ఆడాడు ఆ ఇన్నింగ్స్లో కేవలం 8 పరుగులే చేసి నాథన్ లియాన్ బౌలింగ్లో అవుటయ్యాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ కోలుకోవడంతో మళ్లీ అతనికి అవకాశం రాలేదు.
ఇక ఆ తర్వాత జరిగిన మూడు వన్డేల సిరీస్లో వరుసగా మూడు మ్యాచుల్లో తొలి బంతికే అవుటై చెత్త రికార్డు తన పేరిట రాసుకున్నాడు. అయితే వీటన్నింటిని పట్టించుకోకుండా సూర్యపై నమ్మకం ఉంచాలని బీసీసీఐ అనుకుంటోందట. ఇప్పటికే శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ తదితరులు గాయాలతో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడటం లేదు. తాజాగా ఐపీఎల్లో గాయపడిన కేఎల్ రాహుల్ కూడా ఈ మ్యాచ్కు దూరమయ్యాడు.
దీంతో టీమిండియా మిడిలార్డర్ చాలా బలహీనంగా మారింది. ఈ క్రమంలోనే ఇక్కడ ఆడిన అనుభవం ఉన్న సూర్యకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ అనుకుంటోందట. గతంలో గిల్, వాషింగ్టన్ సుందర్ వంటి వాళ్లు గాయపడినప్పుడు కూడా.. బ్యాకప్గా సూర్యనే బీసీసీఐ ఎంపిక చేసింది. ఇప్పుడు కూడా అదే నిర్ణయం తీసుకొని యూకే వీసా రెడీగా ఉంచుకోవాలని చెప్పిందట అతనికి.
డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే జట్టును కొన్ని రోజుల క్రితమే బీసీసీఐ ప్రకటించింది. ఈ టీంలో రాహుల్తోపాటు జయదేవ్ ఉనద్కత్ కూడా ఐపీఎల్లో ప్రాక్టీస్ చేస్తూ దెబ్బతిన్నాడు. ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ తదితరులు కూడా పూర్తి ఫిట్గా లేరు. ఇలాంటి సమయంలో భారత జట్టులో బ్యాకప్గా యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి కుర్రాళ్లను పంపాలని కూడా బీసీసీఐ ఆలోచిస్తోందని సమాచారం.