
సౌథాంప్టన్: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా.. టీ బ్రేక్ సమయానికి 55.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. ప్రస్తుతం కెప్టెన్ విరాట్ కోహ్లీ (35; 94 బంతుల్లో 1x4), వైస్ కెప్టెన్ అజింక్య రహానే (13; 54 బంతుల్లో 1x4) క్రీజులో ఉన్నారు. అయితే టీ బ్రేక్ను అంపైర్లు ముందుగానే ప్రకటించారు. ప్రస్తుతం సౌథాంప్టన్లో దట్టమైన మేఘాలు అలుముకోవడంతో.. మైదానంలో చీకటి వాతావరణం నెలకొంది. దీంతో అంపైర్లు చర్చించుకుని.. ముందుగానే తేనీరు విరామంను ప్రకటించారు. అయితే సౌథాంప్టన్లో ప్రస్తుతం వర్షం మాత్రం పడట్లేదు. వరణుడు వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచుకు వర్షం ముప్పు ఉన్న విషయం తెలిసిందే.
వర్షం కారణంగా తొలి రోజు రద్దైన డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ రెండో రోజు (శనివారం) మామూలుగానే సాగుతోంది. మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ బ్యాటింగ్కు దిగింది. మ్యాచ్ ఆరంభంలో ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఆచితూచి ఆడారు. వర్షం పడడంతో పిచ్ పూర్తిగా పేసర్లకు అనుకూలంగా మారింది. దీంతో ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ కట్టుదిట్టంగా బంతులేస్తున్నా.. ఇద్దరూ వారిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. భారీ షాట్లు ఆడకుండా, వికెట్ కాపాడుకుంటూ నిదానంగా పరుగులు చేశారు. ఈ క్రమంలో ఓపెనర్లు ఇద్దరూ భారత్ స్కోరును 50 పరుగులు దాటించారు.
కైల్ జేమీసన్ వేసిన 20.1 ఓవర్లో ఓపెనర్ రోహిత్ శర్మ (34; 68 బంతుల్లో 6x4) ఔటయ్యాడు. స్లిప్లో టీమ్ సౌథీ చేతికి చిక్కడంతో భారత్ 62 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. మరికొద్ది సేపటికే నీల్ వాగ్నర్ బౌలింగ్లో శుభ్మన్ గిల్ (28; 64 బంతుల్లో 3x4) ఔటయ్యాడు. 24.3 ఓవర్కు వికెట్ల వెనుక కీపర్ వాట్లింగ్ చేతికి చిక్కాడు. దాంతో భారత్ 63 పరుగుల వద్ద రెండో వికెట్ నష్టపోయింది. ఈ క్రమంలోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ, చేటేశ్వర్ పుజారా కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే అనవసర షాట్లకు పోకుండా ఆచితూడి ఆడుతూ ఒక్కో పరుగు పెంచడంపైనే కోహ్లీ దృష్టిపెట్టాడు.
అప్పటికే క్రీజులో కుదురుకున్నట్టు కనిపించిన చేటేశ్వర్ పుజారా వికెట్ల ముందు దొరికిపోవడంతో భారత జట్టు మూడో వికెట్ కోల్పోయింది. 54 బంతులు ఆడిన పుజారా.. రెండు బౌండరీలతో 8 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం. ఆపై విరాట్ కోహ్లీ, అజింక్య రహానే నిలకడగా ఆడారు. వీరిద్దరూ చెత్త బంతులను వదిలేస్తూనే మంచి బంతులను బౌండరీలకు తరలించారు. ఈ క్రమంలోనే 98 బంతుల్లో 33 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ సమయంలో అంపైర్లు ముందుగానే తేనీరు విరామంను ప్రకటించారు. రెండో సెషన్ పూర్తయ్యేసరికి భారత్ స్కోర్ 120/3గా నమోదైంది. ఈ సెషన్లో మొత్తం 27.3 ఓవర్ల పాటు ఆట కొనసాగగా.. భారత్ ఒక వికెట్ నష్టపోయి 51 పరుగులు చేసింది.