బంగ్లాదేశ్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. కాన్పూర్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో వర్షం కారణంగా దాదాపు రెండున్నర రోజుల ఆట కోల్పోయినప్పటికీ టీమిండియా గొప్పగా పోరాడి మ్యాచ్ను గెలుచుకుంది. 173.2 ఓవర్లలో ముగిసిన రెండో టెస్టులో ఏడు వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తుగా ఓడించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది నాలుగో చిన్న మ్యాచ్.
ఈ విజయంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తును టీమిండియా మరింత పదిలం చేసుకుంది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం భారత్ 74.24 శాతంతో అగ్రస్థానంలో ఉంది. అయితే ఫైనల్ బెర్తు సాధించడానికి భారత్కు అవకాశాలు మెరుగ్లా ఉన్నప్పటికీ గ్యారెంటీ అయితే లేదు. మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్న న్యూజిలాండ్తో మూడు టెస్టుల సిరీస్, నవంబర్ ఆఖర్లో మొదలుకానున్న ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ ఫలితంపై భారత్ ఆధారపడాల్సి ఉంది.

ఈ ఎనిమిది టెస్టులో భారత్ విజయం సాధిస్తే 85.09 శాతంతో అగ్రపీఠాన్ని కైవసం చేసుకుంటుంది. మిగిలిన జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా ముచ్చటగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకుంటుంది. అయితే టీమిండియా నాలుగు విజయాలు, రెండు డ్రాలతో ఈ సైకిల్ ముగిస్తే 67.54 విజయ శాతానికి పడిపోతుంది. అప్పుడు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
మరోవైపు శ్రీలంక అనూహ్యంగా ఫైనల్ రేసులోకి వచ్చింది. ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లపై కలిపి హ్యాట్రిక్ విజయాలు సాధించి టేబుల్లో 55.56 విజయ శాతంతో మూడో స్థానానికి ఎగబాకింది. కివీస్ 0-2 ఓటమి ఆస్ట్రేలియాను పరోక్షంగా ప్రమాదంలోకి నెట్టింది. లంక ఫైనల్ బెర్తు అవకాశాలు గణనీయంగా పెంచుకుంది. శ్రీలంక ఇంకా నాలుగు టెస్టులు ఆడాల్సి ఉంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో రెండు, దక్షిణాఫ్రికాలో రెండు మ్యాచ్లు ఆడనుంది.
ఈ నాలుగింట్లో శ్రీలంక 3-1తో గెలిచినా 61.54 విజయ శాతంతో ఈ డబ్ల్యూటీసీ సైకిల్ను ముగిస్తుంది. ఈ గెలుపు శాతం టాప్-2లో ఉండటానికి ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఫైనల్ బెర్తు కోసం ఆస్ట్రేలియా తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రస్తుతం ఆసీస్ 62.5 శాతంతో రెండో స్థానంలో ఉంది. ఆడాల్సిన ఏడింట్లో గెలిస్తే 76.32 శాతంతో ముగిస్తుంది. అయితే శ్రీలంక చేతిలో ఆసీస్ 0-2తో ఓడితే.. భారత్ చేతిలో ఒక్క టెస్టు కూడా పరాజయం చవిచూడకుండా కనీసం 4-0తో కంగారూలు గెలవాల్సి ఉంటుంది. లంకపై కివీస్ గెలిస్తే ఆస్ట్రేలియాకు ఇంత ఒత్తిడి ఉండేది కాదు. టాప్-2 కోసం భారత్, ఆసీస్ మధ్యే పోటీ ఉండేది.