వారం రోజుల ముందు వరకు వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ క్వాలిఫైకి హాట్ ఫేవరేట్గా ఉన్న భారత్ ఒక్కసారిగా తమ అవకాశాలను ప్రమాదంలోకి నెట్టేసుకుంది. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడి తమ విజయశాతాన్ని గణనీయంగా తగ్గించుకుంది. దాదాపుగా 10+ శాతాన్ని కోల్పోయి 62.82 శాతానికి చేరింది.
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతానికి టీమిండియా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, మూడో సారి ఫైనల్స్కు అర్హత సాధించాలంటే విపరీతంగా శ్రమించాల్సి ఉంది. రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా (62.50)కి, మనకి తేడా కేవలం 0.32 శాతం మాత్రమే. మరోవైపు భారత్ ఓటమి.. శ్రీలంక (55.56 %), న్యూజిలాండ్ (50 %), సౌతాఫ్రికా (47.62 %) జట్ల ఫైనల్ ఆశలు కల్పించింది. ఈ జట్లకు అవకాశాలు మెరుగయ్యాయి.

డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో భారత్ మరో ఆరు టెస్టులు ఆడనుంది. నవంబర్ 1 నుంచి వాంఖడే వేదికగా న్యూజిలాండ్తో మూడో టెస్టు ఆడనుంది. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలో అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ ఆరింట్లో భారత్ కనీసం నాలుగు మ్యాచ్ల్లో నెగ్గాలి. అప్పుడే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా టీమిండియా ముచ్చటగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్స్కు చేరుకుంటుంది.
మూడో టెస్టులో గెలిస్తే టీమిండియా విజయశాతం 64.03కి చేరుకుంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని సౌతాఫ్రికా, శ్రీలంక మాత్రమే అధిగమించగలవు. అయితే నవంబర్లో జరగనున్న శ్రీలంక వర్సెస్ సౌతాఫ్రికా రెండు టెస్టుల సిరీస్ 1-1తో డ్రా కాకపోతే.. భారత్కు కలిసొస్తుంది. ఆ సిరీస్ను శ్రీలంక లేదా దక్షిణాఫ్రికా అయినా గెలవాలి. ఆ సందర్భంలో ఆస్ట్రేలియా సిరీస్ను టీమిండియా 1-0తో కైవసం చేసుకున్న ఫైనల్స్కు చేరే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుత డబ్ల్యూటీసీలో 49 టెస్టుల్లో కేవలం మూడు మాత్రమే డ్రా అయ్యాయి. అది కూడా వర్షం ఆటంకంతోనే.
ఇక మిగిలిన ఆరు టెస్టులను భారత్ మూడు విజయాలు, మూడు ఓటములతో ముగిస్తే విజయ శాతం 58.77కి చేరుకుంటుంది. ఈ సందర్భంలో ఆస్ట్రేలియాతో సహా శ్రీలంక, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు టీమిండియాను అధిగమించే అవకాశం ఉంటుంది.