అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ ఘనంగా ఆరంభించింది.పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ రేసులో నిలవాలంటే ఈ సిరీస్ను తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఆరంభ పోరులో దుమ్మురేపింది. ఆల్రౌండ్ షోతో కంగారూలను కంగారు పెట్టించింది. అదే జోరును పింక్ బాల్తో జరిగే రెండో టెస్టులోనూ ప్రదర్శించాలని టీమిండియా పట్టుదలతో సిద్ధమవుతోంది.
అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి రెండో టెస్టు జరగనుంది. ఈ డే/నైట్ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే శ్రీలంకపై దక్షిణాఫ్రికా ఘన విజయంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ (61.11 %) అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా (57.69 %)ను వెనక్కినెట్టి దక్షిణాఫ్రికా (59.26 %) రెండో స్థానానికి ఎగబాకింది. నాలుగో స్థానంలో న్యూజిలాండ్ (54.55 %)ఉంది.

అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా 5-0, 4-1, 4-0, 3-0తో గెలిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా నేరుగా ఫైనల్స్కు చేరుతుంది. ముచ్చటగా మూడోసారి టైటిల్ పోరుకు అర్హత సాధిస్తుంది. గత రెండు డబ్ల్యూటీసీ ఫైనల్స్కు భారత్ అర్హత సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ను భారత్ 3-1 తేడాతో గెలిస్తే.. ఇతర జట్ల ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. శ్రీలంకతో జరిగే రెండో టెస్టులో సౌతాఫ్రికా విజయం సాధించకూడదు.
3-2తో ఆస్ట్రేలియాపై గెలిచినా భారత్ ఫైనల్స్కు చేరుతుంది. ఆ సందర్భంలో.. ఆస్ట్రేలియాతో శ్రీలంక ఒక్క మ్యాచ్ను అయినా డ్రాగా ముగించాలి. స్వదేశంలో జనవరి 29 నుంచి ఆసీస్తో లంక రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా 2-2తో ముగిస్తే.. శ్రీలంకను సౌతాఫ్రికా 2-0తో తప్పక ఓడించాలి. ఇప్పటికే సఫారీలు తొలి టెస్టును గెలిచారు. అలాగే, ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ను శ్రీలంక కనీసం 1-0తో గెలవాలి.