లోయర్ హట్ (న్యూజిలాండ్): తన రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలకు తెరదించాడు న్యూజిలాండ్ సీనియర్ బ్యాట్స్మన్ రాస్ టేలర్. ప్రతిష్ఠాత్మక ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ అనంతరం టేలర్ క్రికెట్కు వీడ్కోలు చెప్తాడని చాలా మంది భావించారు. సోషల్ మీడియాలో కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ అలాంటిదేమి లేదని, తాను ఆడాలనుకున్నంత వరకు క్రికెట్లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఇప్పట్లో రిటైర్మెంట్ ఇచ్చే ఆలోచనే లేదని టేలర్ చెప్పాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియాపై 8 వికెట్ల తేడాతో గెలుపొందిన న్యూజిలాండ్.. తొలిసారి ఛాంపియన్షిప్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
WTC Final: 100 టెస్టులు ఆడాక కూడా.. బంతులు అలానేనా వేసేది! అంత అనుభవం ఉండి ఏం లాభం?
సౌథాంప్టన్ వేదికగా జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో వరణుడు కీలక పాత్ర పోషించాడు. రెండు రోజులు ఒక్క బంతి కూడా పడలేదు. మరో రెండు రోజులు పూర్తి ఆట సాధ్యపడలేదు. దాంతో రిజర్వు డే రోజు ఫలితం తేలుతుందో లేదోనని భావించారు. అయితే భారత్ త్వరగా ఆలౌట్ కావడంతో స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ సునాయాసంగా అందుకుంది. కోహ్లీసేన తొలి ఇన్నింగ్స్లో 217 పరుగులకు ఆలౌట్ కాగా.. కివీస్ 249 పరుగులు చేసింది. 32 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 170 పరుగులకే ఆలౌట్ అయింది. 140 పరుగులు లక్ష్యాన్ని కివీస్ 2 వికెట్లు నష్టపోయి ఛేదించింది. రాస్ టేలర్ కీలకమైన సమయంలో 47 పరుగులతో రాణించాడు
తాజాగా రాస్ టేలర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నాను. కుటుంబ సభ్యులను, స్నేహితులను కలవడానికి ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నా. వారితో వచ్చే వారాల్లో సంతోషంగా గడుపుతా. మా మధ్య చాలా చర్చలు వస్తాయి. క్రికెట్ను ఇప్పటికీ ప్రేమిస్తున్నా. ఆటలో కొత్త విషయాలు నేర్చుకోవడానికి, ఇంకా మెరుగవ్వడానికి ప్రయత్నిస్తాను. ఈ వయసులోనూ నేను క్రికెట్ ఆడాలనే అనుకుంటున్నాను. నాకు సాధ్యమైనంత వరకు ఆడాలనే ఉంది' అని అన్నాడు.
గత కొద్ది కాలంగా రాస్ టేలర్ మంచి ప్రదర్శనే చేస్తున్నప్పటికీ.. అతడికి గాయాల బెడద కూడా అదే స్థాయిలో ఉంది. గాయాల కారణంగా జట్టులోకి వస్తూ పోతున్నాడు. 2021 మార్చిలో స్వదేశంలో బంగ్లాతో సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు. ఆపై విశ్రాంతి తీసుకుని డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాడు. టేలర్ ఇంకొంత కాలం ఆటలో కొనసాగాలంటే ఫిట్నెస్ కీలకం కానుంది. లేకుంటే త్వరలోనే ఆటకు గుడ్బై చెప్పక తప్పదు. 2023 వన్డే ప్రపంచకప్ వరకు తాను ఆడతానని గతంలో టేలర్ పేర్కొన్న సంగతి తెలిసిందే. విండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ మాదిరిగా 40 ఏళ్ల వరకు ఆడాలనుందని కూడా చెప్పాడు.
ఈ ఏడాది ఆరంభంలో రాస్ టేలర్ ప్రపంచ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. మూడు ఫార్మాట్ (టెస్టు, వన్డే, టీ20)లలో వంద చొప్పున మ్యాచ్లను పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. 2006లో అరంగేట్రం చేసిన 37 ఏళ్ల రాస్ టేలర్.. ఇప్పటివరకు 108 టెస్టులు, 233 వన్డేలు, 102 టీ20 మ్యాచ్లు ఆడాడు. కివీస్ తరఫున 40 సెంచరీలతో ఆ జట్టు తరపున అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్గా కూడా ఘనత వహించాడు. టేలర్ కివీస్ తరఫున వన్డేలు, టెస్టుల్లో అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా కూడా కొనసాగుతున్నాడు.