ఇంగ్లండ్లో బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదని, చాలా ఓర్పుతో ఉండాలని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఇంగ్లండ్ చేరుకున్న అతను ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఇక్కడ బ్యాటింగ్ చేయడం గురించి రోహిత్ మాట్లాడాడు. సాధారణంగానే ఇంగ్లండ్లో బ్యాటింగ్ అంత ఈజీగా ఉండదని అభిప్రాయపడ్డాడు.
'ఇంగ్లండ్లో బ్యాటర్లకు ఛాలెంజింగ్ పరిస్థితులు ఎదురవుతాయి. అయితే ఓర్పుతో ఉంటే మంచి సక్సెస్ కూడా దొరుకుతుంది' అని చెప్పాడు. ఇక్కడ ఆడే సమయంలో ఏ బ్యాటర్ కూడా పూర్తిగా తన జోన్లోకి వెళ్లడం కుదరదని అన్నాడు. సడెన్గా వాతావరణం మారిపోవడంతో ఆట అంతా మారిపోతుందని, కాబట్టి చాలా కాన్సన్ట్రేషన్తో ఉండాలని సూచించాడు.

'ఎక్కువ సేపు ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఆడాల్సి వస్తుంది. అదే సమయంలో ఎప్పుడు బౌలర్లపై ఎదురు దాడి చేయాలని మనకు అర్థం అవుతుంది. మరీ ముఖ్యంగా మన బలాలు ఏంటో అర్థం చేసుకొని ఆడాల్సి ఉంటుంది' అని చెప్పాడు. ఈ క్రమంలోనే ఇంతకుముందు ఈ పిచ్లపై సక్సెస్ అయిన వారిని గమనిస్తారా? వారిలా ఆడే ప్రయత్నం చేస్తారా? అని రోహిత్ను ప్రశ్నించారు.
'నేను వాళ్ల సక్సెస్ను రిపీట్ చేయడానికి ట్రై చెయ్యను. అయితే వాళ్లు ఏ ప్యాటర్న్లో పరుగులు చేశారో తెలుసుకోవడం కూడా ఉపయోగపడుతుంది. ఇక ఓవల్ విషయానికొస్తే ఇక్కడ స్క్వేర్ బౌండరీలు చాలా వేగంగా ఉన్నాయని గమనించా' అని చెప్పాడు. ఈ మైదానంలో 2021లో భారత్ ఆడిన మ్యాచ్లో రోహిత్ శర్మ 127 పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.
అలాగే సడెన్గా ఫార్మాట్ ఛేంజ్ అవడం కూడా సవాలే అని రోహిత్ అన్నాడు. కొన్ని రోజుల వరకు టీమిండియాలో మెజార్టీ సభ్యులు ఐపీఎల్ ఆడిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాలో కూడా కొందరు ప్లేయర్లు ఈ లీగ్లో మెరిశారు. 'ఇలా ఫార్మాట్లు ఛేంజ్ అవడం సవాల్తో కూడుకున్న పనే. మానసికంగా ఫార్మాట్కు అనుగుణంగా మనం మారాలి. అలాగే మన టెక్నిక్ను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి' అని పేర్కొన్నాడు.