డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఆటగాళ్లు కొత్త జెర్సీలో మెరవనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదిదాస్ కంపెనీతో బీసీసీఐ ఒప్పందం చేసుకుంది. ఇది డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచే అమల్లోకి వస్తుంది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ చేరుకున్న భారత ఆటగాళ్ల ప్రాక్టీస్ డ్రెస్లు కూడా కొత్తగానే కనిపించాయి.
ఆదిదాస్ జెర్సీలు కొత్త లుక్లో ఉన్నాయి. తాజాగా వీటిని ఆ కంపెనీ విడుదల చేసింది. వీటిని చూసిన ఫ్యాన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాజాగా టీమిండియా టెస్టు జెర్సీపై ఫొటో షూట్ జరిగింది. దీనిలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తదితరులు పాల్గొన్నారు. వీరంతా కొత్త టెస్టు జెర్సీలో మెరిసిపోతున్నారు.

అయితే ఇది చూసిన కొందరు ఫ్యాన్స్ కూడా ఈ జెర్సీపై పెదవి విరుస్తున్నారు. ప్రముఖ ఫుట్బాల్ క్లబ్ రియల్ మాడ్రిడ్ జెర్సీలా ఇది ఉందని కొందరు విమర్శిస్తున్నారు. కొందరు బాగానే ఉందని అంటున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా వన్డే జెర్సీని కూడా బీసీసీఐ విడుదల చేసింది. రోహిత్ శర్మతోపాటు టీమిండియా మహిళా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్తో ఒక ప్రోమో వీడియో చేసింది.
ఈ వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఈ కొత్త జెర్సీ ఖరీదు రూ.4999 అని తెలుస్తోంది. ఈ రేటు విన్న ఫ్యాన్స్ చాలా మంది ఇది మరీ ఎక్కువ అని ఫీల్ అవుతున్నారు. అయితే బీసీసీఐ డీల్ కోసం ఆదిదాస్ భారీగా ఖర్చు పెట్టిందని, అందువల్లనే ఇలా జెర్సీ రేటు పెరిగిందని కొందరు అంటున్నారు.
టీమిండియా పాత జెర్సీలు రూ.2500 ధర మాత్రమే పలికేవి. ఇప్పుడు ఈ ధర రెండింతలు అవడంపై కొందరు ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్లో మాత్రం భారత ఆటగాళ్లు కొత్త జెర్సీలో అదిరిపోతారని మరికొందరు అంటున్నారు. మరి మీరు కూడా ఈ కొత్త లుక్పై ఒక లుక్కేయండి.