WTC final reserve day: అరుదైన 6 రోజుల టెస్ట్ మ్యాచ్: థ్రిల్లింగ్ క్లైమాక్స్..హై ఎక్స్పెక్టేషన్స్

లండన్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్.. మరో అరుదైన ఘనతను అందుకుంది. ఆరు రోజుల పాటు సాగిన మ్యాచ్గా రికార్డు సృష్టించింది. రిజర్వ్ డేను కూడా కలుపుకొంటే మొత్తంగా ఆరు రోజుల పాటు ఈ టెస్ట్ మ్యాచ్ సాగినట్టవుతుంది. ఆధునిక టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలాంటి సందర్భం దాదాపుగా లేదనే అనుకోవచ్చు. అలాంటి మ్యాచ్ ఫలితం తేలకుండా పోవడానికే అవకాశాలు ఉండటం క్రికెట్ అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. మొట్టమొదటి ఫైనల్ మ్యాచ్ విన్నర్ ఎవరో తెలియకుండా.. డ్రాగా ముగియకూడదని కోరుకుంటోన్నారు. థ్రిల్లింగ్ క్లైమాక్స్ ఉండాలని ఆశిస్తున్నారు.
దూకుడుగా ఆడటం..
ఇలా ఆశించే వారిలో లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ సహా పలువురు మాజీ క్రికెటర్లు కూడా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. వారి అంచనాలకు అనుగుణంగా ఈ మ్యాచ్లో అద్భుతం జరుగుతుందా? లేదా? అనేది టీమిండియా బ్యాట్స్మెన్లు, బౌలర్ల మీద ఆధారపడి ఉంది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్ ఆడుతోన్న కోహ్లీ సేన తొలి రెండు సెషన్లలో దూకుడుగా ఆడి, ఓ మోస్తరు లక్ష్యాన్ని నిర్దేశించినా- న్యూజిలాండ్ను ఒత్తిడిలోకి నెట్టడానికి వీలు ఉంటుందని మాజీ క్రికెటర్లు చెబుతున్నారు. టీమిండియా పేసర్ మహ్మద్ షమీ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. బ్యాట్స్మెన్లు ఓ మోస్తరు స్కోర్ చేసినా.. తమ పని తాము చేసుకుంటామని చెప్పాడు.
130 ఓవర్ల మ్యాచ్..
ఇంకా 130 ఓవర్ల పాటు మ్యాచ్ సాగాల్సి ఉన్నందున.. ప్రత్యర్థి న్యూజిలాండ్ను కార్నర్ చేయడానికి అవకాశం ఉందని సచిన్ టెండుల్కర్ అభిప్రాయపడ్డాడు. ప్రత్యర్థిపై ఒత్తిడిని తీసుకుని రావాలంటే తొలి సెషన్లలో భారత జట్టు కాస్త దూకుడుగా ఆడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. కివీస్ ఇన్నింగ్లో కేన్ విలియమ్సన్తో పాటు లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు కైలె జెమిసన్, టిమ్ సౌథీ చేసిన పరుగులే.. ఇప్పుడు అత్యంత కీలకంగా మారాయని చెప్పుకొచ్చాడు. ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేశారని ప్రశింసించాడు.
హై ఓల్టేజ్ ఇన్నింగ్..
టీమిండియా రెండో ఇన్నింగ్ తనను తీవ్ర ఉత్కంఠతకు గురి చేస్తోందని మాజీ టెస్ట్ ప్లేయర్ వసీం జాఫర్ చెప్పాడు. రెండో ఇన్నింగ్లో కోహ్లీ అండ్ హిస్ టీమ్ బ్యాటింగే మ్యాచ్ను ప్రభావితం చేస్తుందనే సందేశాన్ని పరోక్షంగా పంపించాడతను. విరాట్ కోహ్లీ భారీ ఇన్నింగ్ను ఆడాల్సి ఉంటుందని, అలాగే రిషభ్ పంత్ తనదైన శైలిని ప్రదర్శించాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. టీమిండియా మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ కూడా అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశాడు. ప్రత్యర్థిని ఒత్తిడికి గురి చేయాలనే ఉద్దేశంతో ఆడొద్దని సూచించాడు. బ్యాట్స్మెన్లు తమ సహజసిద్ధ ఆటను ఆడాలని పేర్కొన్నాడు. ప్రత్యర్థికి నిర్దేశించాల్సిన టార్గెట్ గురించి పెద్దగా ఆలోచించవద్దని అన్నాడు.
న్యూజిలాండ్ పక్కా ప్లాన్..
తప్పనిసరిగా దూకుడుగా ఆడాల్సిన పరిస్థితిని న్యూజిలాండ్.. భారత జట్టుకు కల్పించిందని టీమిండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్ పేర్కొన్నాడు. ఇది వారి గేమ్ ప్లాన్ అయి ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. ఏదేమైనప్పటికీ- మ్యాచ్ డ్రాగా ముగిస్తే మాత్రం భారత్ తీవ్ర నిరాశకు గురవుతుందని చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్ను ఒత్తిడిలోకి నెట్టాలంటే.. బారత జట్టు తొలి గంటలో ఆడే విధానమే దాన్ని నిర్దేశిస్తుందని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మరో వికెట్ను కోల్పోకుండా టీమిండియా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందని అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications