లండన్: ఊహించినట్టే- ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ రిజర్వ్ డేకు వచ్చేసింది. ఈ మ్యాచ్కు వేదికగా మారిన సౌథాంప్టన్లో భారీ నుంచి అతి భారీ వర్షాల వల్ల రెండు రోజుల ఆట మొత్తంగా తుడిచిపెట్టుకుని పోవడం వల్ల మ్యాచ్ రిజర్వ్ డేలోకి ఎంట్రీ ఇచ్చింది. రిజర్వ్ డే నాడు మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించడానికి అవకాశం లేదు. రోజులో ఎక్కువ భాగం ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ- వర్షం పడే సూచనలు అంతంత మాత్రమేనని బ్రిటన్ వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
ఉదయం, మధ్యాహ్న సమయంలో ఎండ పడుతుందని కూడా అంచనా వేశారు. దీని ప్రకారం చూసుకుంటే- ఫస్ట్ సెషన్ నుంచి చివరి ఓవర్ వరకూ మ్యాచ్ సాగడానికి గ్యారంటీ ఉన్నట్టే. వర్షం వల్ల డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్కు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందనే కారణంతోనే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ముందుగానే రిజర్వ్ డేను ప్రకటించింది. ఈ విషయంలో ఐసీసీ అంచనాలు తప్పలేదు. అంచనాలకు అనుగుణంగానే వర్షం పడింది గానీ.. రెండురోజుల మ్యాచ్ రద్దయింది. తొలి, నాలుగో రోజు మ్యాచ్ నీటిపాలైంది.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా నిర్వహించబోయే ఫైనల్ మ్యాచ్ కావడం వల్ల ఐసీసీ దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఏదో ఒక జట్టు విజేతగా నిలవాలనే ఉద్దేశంతో రిజర్వ్ డేను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయినప్పటికీ- మ్యాచ్ ఫలితం తేలేలా లేదు. అయిదోరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. ఓపెనర్లిద్దరూ అవుట్ అయ్యారు. రోహిత్ శర్మ-30, శుభ్మన్ గిల్-8 పరుగులు చేశారు. వారిద్దరూ టిమ్ సౌథీ చేతికి ఎల్బీగా చిక్కారు. చేతేశ్వర్ పుజారా-12, విరాట్ కోహ్లీ-8 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.
టీమిండియా రెండో ఇన్నింగ్ పూర్తి కావాల్సి ఉంటుంది.. తన ప్రత్యర్థికి లక్ష్యాన్ని నిర్దేశించాల్సి ఉంటుంది. దాన్ని ఛేదించడానికి న్యూజిలాండ్ కూడా తన రెండో ఇన్నింగ్ ఆడాల్సి ఉంటుంది. ఈ ఒక్కరోజులో ఈ రెండూ దాదాపుగా అసాధ్యమే. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప రిజల్ట్ రాకపోవచ్చు. సౌథాంప్టన్లో ఉదయం పూట 21 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. క్రమంగా 16 డిగ్రీలకు చేరుతుందని అంచనా వేసింది. వర్షం పడటానికి దాదాపుగా అవకాశాలు లేవని తెలిపింది.