డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం భారత్, ఆస్ట్రేలియా తెగ కష్టపడుతున్నాయి. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని ఆస్ట్రేలియా సారధి ప్యాట్ కమిన్స్ భావిస్తున్నాడు. వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన భారత జట్టు కూడా ఎలాగైనా ట్రోఫీ కొట్టాలని అనుకుంటోంది. దీని కోసమే టీమిండియా స్టార్లు అందరూ మ్యాచ్కు ముందు తెగ చెమటోడుస్తున్నారు.

ఈ మ్యాచ్లో భారత జట్టు ఎక్కువగా విరాట్ కోహ్లీ, ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానేపై ఎక్కువగా ఆధార పడనుంది. బ్యాటింగ్లో టీమిండియాకు వీళ్లు ముగ్గురే కీలకం. ఇక బౌలింగ్లో బుమ్రా లేకపోవడంతో మహమ్మద్ షమీపై భారత జట్టు పూర్తిగా ఆధార పడుతుంది. అదే సమయంలో ఆస్ట్రేలియా వీళ్లను నిలువరించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది.
ఇక ఆస్ట్రేలియాతో టెస్టులో చెలరేగే అలవాటు ఉన్న మరో ప్లేయర్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. అతను ఉంటే భారత మిడిలార్డర్ చాలా బలంగా కనిపించేది. కీలకమైన ఈ మ్యాచ్కు ముందు మాట్లాడిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ భవిష్యత్తు గురించి తన అభిప్రాయం వెల్లడించాడు.
'ఆస్ట్రేలియాకు ఆడటాన్ని ఎంత స్పెషల్గా మేం చూపిస్తే అంత మంచిది. హై పెర్ఫామెన్స్తో కొత్త కుర్రాళ్లు కూడా ఆసీస్కు ఆడాలనే ఆశ వారిలో కలిగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఐపీఎల్ వల్ల ప్రపంచ క్రికెట్ చాలా మారిపోయింది. మరికొన్ని ఏళ్లు ఆగితే ఈ లీగ్లదే రాజ్యం. మొత్తం ఏడాది పాటు అంతర్జాతీయ మ్యాచులే ఉంటే.. ఇదేంటి? అని షాకయ్యే రోజులు వస్తాయి’ అని కమిన్స్ అన్నాడు.
క్రికెట్ కూడా ఫుట్బాల్ అడుగు జాడల్లోనే వెళ్తుందని, ఐపీఎల్ వంటి లీగుల ప్రాధాన్యం పెరిగిందని కమిన్స్ చెప్పాడు. దీని వల్ల క్రికెట్ స్వరూపం మారిపోయే అవకాశం ఉందన్నాడు. ఏదేమైనా ఇలా ఫుట్బాల్ మోడల్లో క్రికెట్ ఆడితే కేవలం ఐసీసీ టోర్నీలో మాత్రమే జట్లు పాల్గొంటాయని, ద్వైపాక్షిక సిరీసులు ఉండవని చాలా కాలం నుంచి కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే.