
తీవ్ర నిరాశకు గురయ్యా
కుల్దీప్ యాదవ్ తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన గోడును వెళ్లబోశాడు. 'ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో నేను లేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది. ఎందుకంటే అందులో ఉండాలనుకున్నా. జట్టు విజయంలో నా వంతుగా కృషి చేసి వికెట్లు తీసి భాగస్వామి అవ్వాలనుకున్నా. అయితే అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. అలాంటిటప్పుడు బాధపడటం కూడా సహజమే. అదే సమయంలో వచ్చిన ఇతర అవకాశాల్లో రాణించడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు నేను ఇంగ్లండ్కు వెళ్లలేదు. కాబట్టి శ్రీలంక పర్యటనకు ఎంపికై అక్కడ రాణించే అవకాశం దక్కుతుందని ఆశిస్తున్నా' అని తెలిపాడు.

ప్రతి ఒక్కరికీ జట్టులో ఉండాలని ఉంటుంది
'క్రికెట్ ఎప్పుడూ ఆడుతూనే ఉండాలి. అప్పుడే ఆట సరైన దారిలో ఉంటుంది. ప్రాక్టీస్ ఎప్పుడూ ముఖ్యమే. ఇక తుది జట్టులో లేకపోతే.. ఏ ఆటగాడైనా బాధపడతాడు. ప్రతి ఒక్కరికీ జట్టులో ఉండాలని ఉంటుంది. కానీ ఒక్కోసారి జట్టులో స్థానం లభించకపోవచ్చు. అన్ని మరిచిపోయి ముందుకుసాగాలి. అప్పుడే రాణించగలం' అని మణికట్టు మాంత్రికుడు కుల్దీప్ యాదవ్ పేర్కొన్నాడు. కాగా కివీస్తో పోరులో భారత్ గెలవాలని, కచ్చితంగా గెలుస్తుందనే నమ్మకం ఉందని అతడు ఆశాభావం వ్యక్తం చేశాడు. కుల్దీప్ భారత్ తరఫున 7 టెస్టులు, 63 వన్డేలు, 21 టీ20లు ఆడాడు.

పేలవ ఫామ్తో
టీమిండియా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గత రెండేళ్లుగా పేలవ ఫామ్తో పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఒకప్పుడు అన్ని ఫార్మాట్లలోనూ రెగ్యులర్ ఆటగాడిగా ఉన్న కుల్దీప్.. ఇప్పుడు అవకాశం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. అడపాదడపా వచ్చిన అవకాశంలో కనీసం స్థాయికి తగిన ప్రదర్శన కూడా కనబర్చలేకపోతున్నాడు. ఐపీఎల్ 2019, 2020లోనూ వికెట్లేమీ తీయలేదు. భారత సెలెక్టర్లు అతడికి టీమిండియాకు ఎంపిక చేస్తున్నప్పటికీ.. తుది జట్టులో మాత్రం చోటు దక్కడం లేదు. ఆసీస్ పర్యటనలో ఒక్క మ్యాచ్ ఆడలేదు. ఇక ఇంగ్లండ్పై ఆడినా భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక ఐపీఎల్ 2021లోనూ కోల్కతా తరఫున బరిలోకి దిగలేదు.

ధోనీ రిటైర్ అవ్వకముందు
టీమిండియాకు పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో అద్భుత విజయాలు అందించిన మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్. ఈ జోడి మధ్య ఓవర్లలో పరుగులు కట్టడిచేస్తూ.. వికెట్లు తీసి ప్రత్యర్ధిని ఒత్తిడిలోకి నెట్టేవారు. ఇద్దరూ మణికట్టు స్పిన్నర్లు కావడంతో బాగా సక్సెస్ అయ్యారు. అయితే ఇదంతా జరిగింది మాజీ సారథి ఎంఎస్ ధోనీ రిటైర్ అవ్వకముందు. కానీ వారిద్దరూ కలిసి ఆడే పరిస్థితులు ఇప్పుడు లేవు. కుల్దీప్, చహల్ కలిసి 2019 జూన్లో చివరిసారి ఆడారు. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కారణంగానే తామిద్దరం కలిసి ఆడే ఛాన్స్ రావడం లేదని చహల్ ఇటీవల అన్నాడు.


Click it and Unblock the Notifications
