తొలిసారి టెస్టు కిరీటం దక్కించుకోవాలని ఆస్ట్రేలియా, భారత్ రెండు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇంగ్లండ్లోని ఓవల్ వేదికగా జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఈ టీమ్స్ గట్టిగా రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాను ఇబ్బంది పెట్టే విషయం ఏంటో ఆ టీం మాజీ ప్లేయర్ ఆరోన్ ఫించ్ వెల్లడించాడు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు.
ఆస్ట్రేలియా బ్యాటర్లకు ప్రధాన సమస్య.. భారత్ వద్ద ఉన్న కొత్త బంతి బౌలర్లే అని ఫించ్ అన్నాడు. 'కొత్త బంతితో బౌలింగ్ చేసే ఇద్దరు బౌలర్లు. వాళ్లిద్దరూ కొన్నేళ్ల నుంచి అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ మంచి సీమ్తో ఫ్లాట్ వికెట్లపై కూడా నాణ్యమైన బ్యాటర్లను అవుట్ చేస్తాడు' అని ఫించ్ అన్నాడు. తను ఆటలో ఎప్పుడూ ఓటమి అంగీకరించడని మెచ్చుకున్నాడు.

ఇప్పటి వరకు తన కెరీర్లో సిరాజ్ 18 టెస్టులు ఆడాడు. వీటిలో 31.29 సగటుతో 47 వికెట్లు తీసుకున్నాడు. అంతేకాదు, ఆస్ట్రేలియాపై ఇప్పటి వరకు ఆరు టెస్టులు ఆడిన అతను 2.64 సగటుతో 14 వికెట్లు తీసుకున్నాడు. 'మ్యాచ్ కష్టంగా ఉన్నప్పుడు మనం కావాలనుకునే బౌలర్ సిరాజ్. తన యాటిడ్యూడ్ అర్థమైపోతుంది. ఎప్పుడూ పోటీలో ఉంటాడు' అని తెలిపాడు.
మరో పేసర్ షమీ గురించి మాట్లాడుతూ.. 'షమీ గురించి ఏం చెప్పినా తక్కువే. అతను 2018 ఆస్ట్రేలియా పర్యటనలో బోల్ట్ అప్రైట్ సీమ్తో బౌలింగ్ మొదలు పెట్టాడు. అప్పుడే మేం షాకయ్యాం. బంతి సీమ్ ఏమాత్రం కదలకుండా వికెట్లను దాటేస్తుంది. అలా ఒకటి కాదు.. రెండు కాదు.. ప్రతి బంతి అలాగే వేశాడు' అని మెచ్చుకున్నాడు.
'అంటే షమీ వేసే ప్రతి డెలివరీలో మంచి సీమ్తో పాటు మూవ్మెంట్ కూడా చూపిస్తున్నాడు అన్నమాట. వీళ్లిద్దరూ కనుక వార్నర్, ఖవాజా వికెట్లను త్వరగా తీసుకుంటే ఆస్ట్రేలియా కష్టాల్లో పడుతుంది. అలాగే బంతి కొత్తగా ఉన్నప్పుడే లబుషేన్, స్టీవ్ స్మిత్ను ఇబ్బంది పెట్టడం మొదలు పెడితే.. అక్కడే విజేత ఎవరో డిసైడ్ అయిపోయే ఛాన్స్ ఉంది' అని ఫించ్ వివరించాడు.