భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్కు రెడీ అవుతున్న నేపథ్యంలో కొందరు నిపుణులు టీమిండియాలో ఒక లోటును ఎత్తి చూపుతున్నారు. భారత బృందంలో సరైన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ లేడు. ఆసీస్ జట్టు కామెరూన్ గ్రీన్ ఈ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కానీ భారత్లో అలాంటి ప్లేయర్ లేడు. హార్దిక్ పాండ్యా ఉన్నా కూడా అతను టెస్టు క్రికెట్కు దూరంగా ఉంటున్నాడు.
ఈ క్రమంలోనే తాజాగా త్రిపుర క్రికెట్ జట్టుకు కన్సల్టెంట్గా వచ్చిన లాన్స్ క్లూసెనర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాండ్యా చాలా ఈజీగా టెస్టు క్రికెట్ను వదిలేశాడని క్లూసెనర్ అభిప్రాయపడ్డాడు. చివరగా 2018లో సౌతాంప్టన్ వేదికగా జరిగిన టెస్టులో పాండ్యా ఆడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2018 నుంచి 2021 వరకు గాయాలతో సతమతం అయిన పాండ్యా.. ఇటీవలే పునరాగమనం చేశాడు.

అయితే వర్క్లోడ్ మేనేజ్మెంట్ కోసం కేవలం వైట్ బాల్ క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. మార్చి నెలలో డబ్ల్యూటీసీ గురించి మాట్లాడుతూ.. తను ఆ జట్టులో ఉండేందుకు ఏం చేయలేదని, కాబట్టి తను ఆడటం కరెక్ట్ కాదని అన్నాడు. ఇదే విషయంపై క్లూసెనర్ను తాజాగా విలేకరులు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన అతను.. 'నిజమే.. పాండ్యా చాలా ఈజీగా టెస్టు క్రికెట్ను వదిలేశాడు' అని చెప్పాడు.
'ఒక క్రికెటర్గా మనం ఎక్కడున్నాం? అసలు మనం ఏంటి? అని టెస్టు పెట్టే అత్యున్నత స్థాయి ఆట టెస్టు క్రికెట్. ఈ ఆట పుట్టినప్పటి నుంచి చూసుకున్నా కూడా టెస్టుల్లో పెద్దగా మార్పులు రాలేదు. కానీ టైం మారిపోయింది. పాండ్యా ఒక ఫెంటాస్టిక్ ప్లేయర్. తను ఫిట్గా ఉండి 135+ స్పీడుతో బౌలింగ్ చేస్తే ప్రత్యర్థులకు సవాల్గా మారతాడు. ప్రపంచంలోని బెస్ట్ ఆల్రౌండర్లలో ఒకడిగా ఎదుగుతాడు' అని చెప్పాడు. ఇలాంటి ప్లేయర్లు ఏ ఫార్మాట్లో అయినా కీలకమే అని తెలిపాడు.