సౌథాంప్టన్: న్యూజిలాండ్తో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత్ తడబడుతోంది. ఆదివారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ వరుసగా వికెట్లు కోల్పయింది. భోజన విరామ సమయానికి భారత్ 7 వికెట్ల నష్టానికి 211 రన్స్ చేసింది. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా (15), ఇషాంత్ శర్మ (2) ఉన్నారు. తొలి సెషన్లో కోహ్లీసేన 4 వికెట్లు కోల్పోయి 65 రన్స్ చేసింది. కివీస్ బౌలర్లలో కైల్ జేమీసన్ మూడు వికెట్లు తీయగా.. నీల్ వాగ్నర్ రెండు వికెట్లు పడగొట్టాడు. మూడో రోజు తొలి సెషన్లో టీమిండియాపై కివీస్ ఆధిపత్యం చెలాయించింది. అందివచ్చిన ఒక్క అవకాశాన్ని కూడా బ్లాక్ కాప్స్ వదలలేదు. ముఖ్యంగా స్లిప్ ఫీల్డర్లు అద్భుత క్యాచులు పట్టారు.
అంతకుముందు 146/3 ఓవర్ నైట్ స్కోర్తో బరిలోకి దిగిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానే బ్యాటింగ్ ఆరంభించగా.. అర్ధ శతకాలు కూడా పూర్తి చేసుకోకముందే వెనుదిరిగారు. ఓవర్ నైట్ స్కోర్కు భారత్ మూడు పరుగులు మాత్రమే జోడించి కోహ్లీ రూపంలో నాలుగో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ ముంగిట కోహ్లీ (132 బంతుల్లో 44) ఎల్బీగా వెనుదిరిగాడు. ఓవర్నైట్ స్కోర్కు ఒక్క పరుగు కూడా చేయకుండానే కైల్ జెమీసన్ అద్భుత బంతికి పెవిలియన్ చేరాడు. రివ్యూ తీసుకున్నా.. ఫలితం లేకపోయింది. పిచ్ నుంచి లభిస్తున్న సహకారంతో న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగడంతో పూర్తిగా డిఫెన్స్కు పరిమితమైన కోహ్లీ.. కంగారుపడ్డాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ కూడా విరాట్ కోహ్లీ లానే డిఫెన్స్ చేశాడు. తన శైలికి పూర్తి బిన్నంగా ఆడాడు. మరోవైపు అజింక్య రహానె మాత్రం సింగిల్స్ తీస్తూ.. కాస్త భారత స్కోరును కదిలించాడు. పంత్ ఓ ఫోర్ బాది గాడిలో పడ్డాడనుకున్నా.. అంతలోనే ఔట్ అయ్యాడు. జేమీసన్ వేసిన 73.4 ఓవర్కు పంత్ (4) స్లిప్లో లాథమ్ చేతికి చిక్కాడు. దాంతో భారత్ 156 పరుగుల వద్ద సగం వికెట్లు కోల్పోయింది. ఆపై రహానె కూడా పెవిలియన్ బాట పట్టాడు. వాగ్నర్ వేసిన 79వ ఓవర్ నాలుగో బంతికి రహానే (49) హాఫ్ సెంచరీ ముందు క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో భారత్ కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ నేపథ్యంలోనే జోడీ కట్టిన రవిచంద్రన్ అశ్విన్ (22), రవీంద్ర జడేజా కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అశ్విన్ కొన్ని చూడముచ్చటైన షాట్లు ఆడాడు. అయితే ధాటిగా ఆడే క్రమంలో సౌథీ బౌలింగ్లో అశ్విన్ పెవిలియన్ చేరాడు. దాంతో భారత్ 205 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. అనంతరం జడేజా, ఇషాంత్ శర్మ మరో వికెట్ పడకుండా తొలి సెషన్ను ముగించారు.
Danish Aziz: ఒకే ఓవర్లో 33 పరుగులు..ప్లేఆఫ్ బెర్త్ ఖరారు!!