డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఆస్ట్రేలియా జట్టు కూడా గట్టిగా సిద్ధం అవుతోంది. టీమిండియాను ఎలాగైనా ఓడించిన టెస్టు ట్రోఫీని తమ ఖాతాలో వేసుకోవాలని అనుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా ఈ మ్యాచ్ గురించి తన అభిప్రాయాన్ని చెప్పాడు ఆసీస్ యంగ్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సాధారణంగానే ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే చాలు విరాట్ కోహ్లీ రెచ్చిపోతాడు. ఈ టీంపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో కోహ్లీ ఒకడు. ఇప్పటి వరకు ఆసీస్పై 24 మ్యాచులు ఆడిన కోహ్లీ 48.26 సగటుతో 1979 పరుగులు చేశాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో కూడా కోహ్లీ సూపర్ ఫామ్ చూపించాడు. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా అతను చెలరేగేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు.

కామెరూన్ గ్రీన్ మాట్లాడుతూ.. 'ఏదైనా బిగ్ స్టేజ్ అయితే విరాట్ కోహ్లీ రెచ్చిపోతాడని నా నమ్మకం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కచ్చితంగా బడా వేదికే. అతను కనుక ఈ మ్యాచ్ గట్టిగా టీమిండియా గెలింపించగలడు కూడా' అని చెప్పాడు. గ్రీన్ కూడా ఐపీఎల్లో అద్భుతంగానే రాణించాడు. మినీ వేలంలో భారీ ధర పలికిన ఆటగాళ్లలో గ్రీన్ ఒక్కడే ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
అయితే సడెన్గా పొట్టి ఫార్మాట్ నుంచి టెస్టులకు మారడంలో తనకేమీ ఇబ్బంది లేదని క్లారిటీ ఇచ్చాడు. 'మైదానంలో దిగి ఆడేవాడికి టెస్టు క్రికెట్ కన్నా మంచి ఆట మరొకటి ఉండదు. మంచి టెన్షన్ ఉంటుంది. ఆ ఒత్తిడిని తట్టుకున్న ఆటగాళ్లే బెస్ట్ అని నా నమ్మకం' అని చెప్పాడు. ఇప్పటి వరకు భారత్పై గ్రీన్ ఆరు టెస్టు మ్యాచులు ఆడాడు. వీటిలో 371 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే బంతితో పెద్దగా రాణించలేదు. కానీ ఇంగ్లండ్ పరిస్థితుల్లో అతను ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.