ప్రస్తుతం ఐపీఎల్లో అందర్నీ ఆశ్చపరుస్తున్న ఆటగాడు ఎవరు? అంటే చటుక్కున గుర్తొచ్చే పేరు అజింక్య రహానే. టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్గా పేరొందిన అతను.. ఈ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున చెలరేగుతున్నాడు. ధనాధన్ బ్యాటింగ్తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అసలు రహానే ఇలా ఆడగలడా? అనుకున్న వారందరికీ దిమ్మతిరిగే షాకిచ్చాడు.
కేవలం ఐపీఎల్లోనే కాదు. దేశవాళీల్లో కూడా రహానే మంచి ఫామ్ కనబరిచాడు. డొమెస్టిక్ సర్క్యూట్లో ఏడు మ్యాచులు ఆడిన అతను.. రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ సాయంతో 634 పరుగులు చేశాడు. అతని సగటు కూడా 57.63గా ఉండటం గమనార్హం. దీనికితోడు ప్రస్తుతం ఐపీఎల్లో అతని ఫామ్ చూసిన సెలెక్టర్లు మరో ఆలోచన లేకుండా.. శ్రేయాస్ అయ్యర్ స్థానంలో రహానేను సెలెక్ట్ చేశారు.

ధోనీ కెప్టెన్సీలో రహానే అద్భుతంగా ఆడుతున్నాడు. ఐదు మ్యాచుల్లో 52.25 సగటుతో 209 పరుగులు చేశాడు. వీటిలో రెండు కీలకమైన హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా రహానే స్ట్రైక్ రేట్ 199.04గా ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడే జట్టులో రహానేకు చోటు దక్కింది. దీనిపై స్పందించిన రహానే సంతోషం వ్యక్తం చేశాడు.
కొంత కాలంగా సరైన ఫామ్లో లేకపోవడంతో టీమిండియాలో కూడా అతను చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన పరిస్థితి గురించి పోస్టు పెట్టిన రహానే.. 'చాలా ఏళ్లపాటు స్పాట్ లైట్లో ఉన్న ఆటగాడిగా.. నాపై ఉండే అంచనాలో ఎంత భారంగా ఉంటాయో తెలుసు. అయితే ఈ ఒత్తిడిని పట్టించుకోకుండా.. ఏం చెయ్యగలనో, వేటిని కంట్రోల్ చేయగలనో వాటిపై ఫోకస్ పెట్టడం నేర్చుకున్నా. తమ ఫీల్డ్లో రాణించాలని అనుకుంటున్న వాళ్లందరికీ నేను ఇచ్చే సలహా కూడా అదే' అని చెప్పుకొచ్చాడు.
కాబట్టి అందరూ తమ తమ నైపుణ్యాలను బలంగా నమ్మాలని, అప్పుడే ఫలితాలు కూడా ఆశించినట్లే వస్తాయని చెప్పాడు. అయితే ఇలా అనుకున్న ఫలితం వచ్చే వరకు కష్టపడటం ఆపకూడదన్నాడు. 'ఆ ఫలితం వచ్చే వరకు అటు వైపు మన ప్రయాణాన్ని ఆపకూడదు. మరింత మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తూనే ఉండాలి' అని రహానే పేర్కొన్నాడు. ఈ పోస్టు చూసిన వాళ్లంతా రహానేకు కంగ్రాట్స్ చెప్తున్నారు.