టీ20 ఫార్మాట్కు పాపులారిటీ పెరగడంతో టెస్టులు కనుమరుగైపోతాయని చాలా మంది భయపడ్డారు. అయితే అలాంటి సమయంలో ప్రపంచ క్రికెట్ను కోహ్లీ తుఫానులా కమ్మేశాడు. టెస్టుల్లో తన మార్కు కెప్టెన్సీ, వైరాలతో ఈ ఫార్మాట్కు మళ్లీ ఊపిరిలూదాడు. దీంతో టెస్టులకు మళ్లీ జీవం వచ్చింది. ప్రపంచం మొత్తం టెస్టులకు ప్రాధాన్యం పెరిగింది.
అయితే గతేడాది అతను టెస్టు కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. కోహ్లీ ఇలా రాజీనామా చేయడం వల్ల టెస్టు క్రికెట్కు తీరని లోటు జరిగిందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టు 209 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టెస్టు క్రికెట్ గురించి మాట్లాడిన మోర్గాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

'ఇప్పటికీ నాకు టెస్టు క్రికెట్ నమ్మశక్యంగా ఉండదు. కానీ ఇప్పుడు ఆ ఫార్మాట్కు మళ్లీ గడ్డు కాలం వచ్చింది. ఎందుకంటే అది కెప్టెన్గా విరాట్ కోహ్లీని కోల్పోయింది. తనకు ఈ ఫార్మాట్ అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని కోహ్లీ కూడా చాలాసార్లు చెప్పాడు' అని మోర్గాన్ అన్నాడు. క్రికెట్లో టెస్టులు చాలా ముఖ్యమని కోహ్లీ చాలాసార్లు అన్నాడు. తనకు ఈ ఫార్మాట్ అంటే చచ్చేంత ఇష్టమని కూడా అన్నాడు.
భారత్ తరఫున అత్యంత సక్సెస్ఫుల్ కెప్టెన్గా రికార్డు సృష్టించిన కోహ్లీ.. తన కెరీర్లో 68 టెస్టులకు కెప్టెన్సీ చేశాడు. వీటిలో 39 మ్యాచులు గెలిచాడు. అతని విన్నింగ్ పర్సంటేజ్ 58.82 కావడం గమనార్హం. గతేడాది సౌతాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్ను 1-2తో కోల్పోయిన తర్వాత తన కెప్టెన్సీకి కోహ్లీ వీడ్కోలు పలికాడు. అప్పటి నుంచి ప్రపంచ టెస్టు క్రికెట్లో జోష్ తగ్గినట్లయింది.
అయితే ప్రస్తుతం ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా కోహ్లీ వంటి వాడేనని మోర్గాన్ అన్నాడు. కోహ్లీ తర్వాత ఈ ఫార్మాట్పై ఆసక్తిని పెంచుతున్న కెప్టెన్ స్టోక్స్ అని కొనియాడాడు. 'స్టోక్స్ కూడా కోహ్లీలాగే. ఈ ఫార్మాట్ను పాపులర్ చేయడానికి ఏం చేయలో అంతా చేస్తున్నాడు' అని మెచ్చుకున్నాడు.