డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టు మరో హార్ట్ బ్రేకింగ్ ఓటమి చవిచూసింది. ఈ ఓటమికి టీమిండియా టాపార్డర్ వైఫల్యమే ప్రధాన కారణం అని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే కీలకమైన ఈ మ్యాచ్లో విఫలమైన పుజారా, విరాట్ కోహ్లీ ఇక టెస్టులకు వీడ్కోలు పలకాలని ఫ్యాన్స్ మండిపడ్డారు. చెత్త షాట్లు ఆడి అవుటైన వీళ్లు టెస్టులకు పనికి రారు అని అన్నారు.
అయితే ఈ అభిప్రాయాలతో బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్, టీమిండియా లెజెండ్ సౌరవ్ గంగూలీ విభేదించాడు. కేవలం ఒక్క ఓటమితో ఈ ఆటగాళ్లపై ఒక నిర్ణయానికి రావడం కరెక్ట్ కాదన్నాడు. 'ఒక ఓటమి చూసిన తర్వాత ఒక నిర్ణయానికి రావడం మంచిది కాదు. భారత్ వద్ద ఎప్పుడూ మంచి ట్యాలెంట్ ఉంటూనే ఉంది. కానీ అప్పుడే కోహ్లీ, పుజారాను పక్కన పెట్టేయాలనడం కరెక్ట్ అని నాకు అనిపించడం లేదు.' అని దాదా అన్నాడు.

'కోహ్లీ వయసు కేవలం 34 సంవత్సరాలే. కాబట్టి అప్పుడే అతన్ని కొట్టి పారేయకూడదు' అని చెప్పిన దాదా.. అదే సమయంలో కొత్త కుర్రాళ్లకు కూడా అవకాశాలు ఇవ్వాలని సూచించాడు. 'దేశవాళీల్లో కొందరు సత్తా ఉన్న కుర్రాళ్లు కనిపిస్తున్నారు. వాళ్లకు అవకాశాలు ఇస్తేనే కదా ఎలా ఆడతారో తెలిసేది. యశస్వి జైస్వాల్, రజత్ పటీదార్ ఎవరైనా అంతే' అని గంగూలీ తెలిపాడు.
అలాగే అభిమన్యు ఈశ్వరన్ కూడా చాలా పరుగులు చేశాడని గుర్తుచేశాడు. వీరితోపాటు శుభ్మన్ గిల్ కూడా ఇంకా కుర్రాడే అని చెప్పాడు. అక్కడితో ఆగని దాదా.. టెస్టుల్లో హార్దిక్ పాండ్యా ఆడటం కూడా టీమిండియాకు చాలా అవసరం అన్నాడు. 'ఒకవేళ హార్దిక్ కనుక నా మాటలు వింటుంటే.. అతను కచ్చితంగా మళ్లీ టెస్టులు ఆడాలి. అతను చాలా ట్యాలెంటెడ్' అని గంగూలీ వెల్లడించాడు.