డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టు ఘోరంగా ఓడింది. ఈ ఓటమికి రోహిత్ కెప్టెన్సీ కూడా ఒక కారణమే. టాస్ గెలిచిన అతను బౌలింగ్ ఎంచుకోవడం, సరైన ఫీల్డ్ సెటప్లు లేకపోవడంతో భారత్ ఓడిపోయింది. దానికితోడు అతను బ్యాటింగ్లో కూడా విఫలమయ్యాడు. ఈ క్రమంలో భారత కెప్టెన్గా రోహిత్ను తొలగించేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
వెస్టిండీస్తో జరిగే టెస్టు సిరీస్.. కెప్టెన్గా రోహిత్కు చివరిదని అంటున్నారు. ఈ సిరీస్ తర్వాత రోహిత్ నుంచి కొత్త వారికి జట్టు పగ్గాలు అందిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే రోహిత్ వయసు 36 సంవత్సరాలు. ఇక మరో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే సరికి అతని వయసు 38కి చేరుతుంది. ఆ వయసులో అతను భారత జట్టుకు కెప్టెన్సీ చేయడం చాలా కష్టం.

ఇప్పటికే ఫిట్నెస్ సమస్యలతో బాధ పడుతున్న రోహిత్.. ఆ వయసులో అసలు క్రికెట్ ఆడేంత ఫిట్నెస్తో ఉంటాడా? అనేది అసలు ప్రశ్న. అయితే రోహిత్ను కెప్టెన్గా తొలగిస్తున్నాం అనేది వట్టి గాలి వార్త అని బీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి. 'ఇవన్నీ ఎలాంటి ఆధారాలు లేని వార్తలు. వచ్చే డబ్ల్యూటీసీ సైకిల్ అంతా రోహిత్ ఆడతాడా? అనేది ప్రశ్నార్థకమే. కానీ అతన్ని తొలగించాలని మేం అనుకోవడం లేదు' అని బీసీసీఐ అధికారి చెప్పారు.
'వచ్చే డబ్ల్యూటీసీ సైకిల్ ముగిసే సరికి రోహిత్ వయసు 38కి చేరుతుంది. అప్పటికి శివ్ సుందర్ దాస్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నాం. వెస్టిండీస్ టెస్టుల తర్వాత అతని బ్యాటింగ్ ఫామ్ను బట్టి సెలెక్షన్ కమిటీ ఒక నిర్ణయానికి రావలసి ఉంటుంది' అని సదరు అధికారి అభిప్రాయపడ్డాడు.
'వెస్టిండీస్ టెస్టుల తర్వాత మళ్లీ డిసెంబరు వరకు భారత జట్టు టెస్టులు ఆడదు. డిసెంబరులో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్తుంది. కాబట్టి కెప్టెన్సీ విషయంలో సెలెక్షన్ కమిటీ ఒక నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం ఉంది. అప్పటికి కొత్త సెలెక్టర్ (కొత్త చైర్మన్) కూడా ప్యానెల్లో చేరతారు. అప్పుడే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారు' అని వివరించారు.