డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టు ఘోరంగా ఓడింది. ఈ ఓటమికి రోహిత్ కెప్టెన్సీ కూడా ఒక కారణమే. టాస్ గెలిచిన అతను బౌలింగ్ ఎంచుకోవడం, సరైన ఫీల్డ్ సెటప్లు లేకపోవడంతో భారత్ ఓడిపోయింది. దానికితోడు అతను బ్యాటింగ్లో కూడా విఫలమయ్యాడు. ఈ క్రమంలో భారత కెప్టెన్గా రోహిత్ను తొలగించేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ మ్యాచ్ తర్వాత కొత్త డబ్ల్యూటీసీ ఫైనల్ మొదలైంది. భారత జట్టు తమ తొలి మ్యాచ్లో వెస్టిండీస్ను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో జట్టులో పలు మార్పులు చేయాలని భారత జట్టు భావిస్తోంది. అయితే ఈ సిరీసులో కూడా ఛటేశ్వర్ పుజారా వంటి ప్లేయర్లకు అవకాశం ఇవ్వడంపై మాజీ సెలెక్టర్ దేవాంగ్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అతని కన్నా యశస్వి జైస్వాల్ వంటి కుర్రాళ్లకు ఛాన్స్ ఇస్తే అద్భుతంగా ఉంటుందన్నాడు.

'వెస్టిండీస్తో టెస్టు సిరీసులో పుజారాను ఆడించడమే నాకు తెలిసి సమస్య. అతను ఆడితే మరో ఏడాదిపాటు అతనికి అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే ఈ సిరీస్ తర్వాత డిసెంబర్ వరకు మళ్లీ టెస్టులో లేవు. ఇలాంటి సమయంలో పుజారాను ఆడిస్తారా? లేకపోతే కుర్రాడికి అవకాశం ఇచ్చి, పెద్ద మ్యాచులకు అతన్ని రెడీ చేస్తారా?' అని గాంధీ ప్రశ్నించాడు.
అలాగే భవిష్యత్తులో భారత జట్టు పగ్గాలు శుభ్మన్ గిల్కు దక్కుతాయని గాంధీ అభిప్రాయపడ్డాడు. అయితే అప్పటి వరకు జట్టు పగ్గాలను రవిచంద్రన్ అశ్విన్ లేదంటే అజింక్య రహానే వంటి వారికి ఇస్తే బాగుంటుందని చెప్పాడు. కుర్రాళ్లు చేతికి అంది వచ్చే వరకూ వీరికి కెప్టెన్సీ అవకాశం ఇవ్వడం మంచిదని తెలిపాడు. వెస్టిండీస్తో భారత్ ఆడే తొలి టెస్టు జులై 12న మొదలవుతుందనే సంగతి తెలిసిందే.
'అశ్విన్కు కెప్టెన్సీ ఎందుకు ఇవ్వరు? ఓవర్సీస్ సిరీసుల్లో అతను ఆడతాడో లేదో కూడా చెప్పలేం అంటారా? అయితే రహానే పరిస్థితి ఏంటి? అతను వైస్ కెప్టెన్గా ఉన్నప్పుడు కూడా అతన్ని జట్టులోకి తీసుకోలేదు కదా. కాబట్టి అశ్విన్కు కెప్టెన్సీ ఇవ్వొచ్చు. లేదంటే రహానేకు అయినా కొంత కాలం జట్టు పగ్గాలు ఇవ్వండి. గిల్ తన స్థానాన్ని పదిలం చేసుకున్న తర్వాత అతనికి కెప్టెన్సీ ఇవ్వొచ్చు' అని చెప్పుకొచ్చాడు.